
కుటుంబ కలహాలతో భార్యాభర్తల ఆత్మహత్య
మునిపల్లి(అందోల్): కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దగోపులారం గ్రామంలో చోటు చేసుకుంది. బుదేరా ఎస్ఐ రాజేశ్ నాయక్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బేగరి రమేశ్కు 13 సంవత్సరాల క్రితం కోహిర్ మండలం బిలాల్పూర్ గ్రామానికి చెందిన అనితతో వివాహం అయింది. వీరికి ముగ్గురు సంతానం. రమేశ్ తన భార్యపై అనుమానం పెంచుకోవడంతో మూడు నెలల నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 2వ తేదీన అర్ధరాత్రి సమయంలో భార్యాభర్తలు గొడవపడి ఇంట్లో ఐరన్ రాడ్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ సత్తయ్య గౌడ్, సీఐ వెంకటేశం, క్లూస్ టీం సిబ్బంది వచ్చి పరిశీలించారు.
భార్య కాపురానికి రావడం లేదని భర్త..
కౌడిపల్లి(నర్సాపూర్): భార్య కాపురానికి రావడం లేదని భర్త గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ రంజిత్రెడ్డి వివరాల ప్రకారం.. మండలంలోని రాజీపేట గ్రామానికి చెందిన బాంచ శ్రీకాంత్(30)కి శివ్వంపేట మండలం గంగాయిపల్లికి చెందిన స్వాతితో ఏడాది క్రితం వివాహం అయింది. పదిహేను రోజుల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరగగా స్వాతి పుట్టింటికి వెళ్లింది. భార్యను తీసుకొచ్చేందుకు అత్తగారింటికి శ్రీకాంత్ వెళ్లగా ఇక్కడికి రాలేదని చెప్పి పంపారు. అనంతరం 31న మరోసారి అతడు వెళ్లగా భార్య కుటుంబ సభ్యులు కాపురానికి పంపమని, విడాకులు తీసుకుంటామని చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన అతడు ఇంటికి వచ్చి గడ్డి మందు తాగాడు. అనంతరం అన్న బాలకృష్ణతో విషయం చెప్పడంతో బాధితుడ్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు.
చెరువులో దూకి వృద్ధురాలు..
హవేళిఘణాపూర్(మెదక్): అనారోగ్యంతో ఓ వృద్ధురాలు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మెదక్రూరల్ పోలీస్స్టేషన్ పరిఽధిలోని అవుసులపల్లి గ్రామంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన నాగారం రామవ్వ(80) కుమారుడు సిద్దిరాంలుకు స్వగ్రామంలో ఇళ్లు లేకపోవడంతో మెదక్ పట్టణం పిల్లికొట్టాల్ వద్ద గల ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్లో నివాసముంటున్నారు. సోమవారం రామవ్వ స్వగ్రామం అవుసులపల్లి గ్రామానికి వెళ్తానని చెప్పింది. రాత్రి వరకు రాలేదు. ఉదయం గ్రామ శివారులో ఉన్న చెరువులో మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుందని, మనస్తాపంతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందని మృతుడి కుమారుడు సిద్దిరాంలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాల సదనం నుంచి కూతురును పంపబోమన్నందుకు..
పాపన్నపేట(మెదక్): బాల్య వివాహమై బాల సదనంలో ఉన్న కూతురును ఇంటికి పంపించాలని తల్లిదండ్రులు అధికారులను కోరగా వారు నిరాకరించారు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక తల్లిదండ్రులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన మండల పరిధిలోని ఏడుపాయల్లో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... శివ్వంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన 9వ తరగతి చదువుతున్న బాలికకు 15 రోజుల క్రితం ములుగు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకునితో వివాహం జరిగింది. ఈ విషయం బయటకు రావడంతో సోమవారం ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు బాలిక తల్లిదండ్రులు, పెళ్లి కుమారునిపై కేసు నమోదు చేసి బాలికను మెదక్ బాల సదనంకు తరలించారు. మంగళవారం బాలికను చూసేందుకు బాలసదనం వెళ్లిన తల్లిదండ్రులు తమ కూతురును ఇంటికి పంపించాలని ఐసీడీఎస్ అధికారులను కోరారు. ఆమెను ఏదైనా రెసిడెన్షియల్ స్కూల్లో చదివిస్తామని ఐసీడీఎస్ డీపీపీఓ కరుణ స్పష్టం చేశారు. దీంతో మనస్తాపం చెందిన బాలిక తల్లిదండ్రులు ఏడుపాయలకు వచ్చి, విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అనంతరం వారు తమ సోదరులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

కుటుంబ కలహాలతో భార్యాభర్తల ఆత్మహత్య