
బ్రిడ్జిపై నుంచి లారీ బోల్తా
ఒకరు మృతి.. మరొకరికి గాయాలు
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ బైపాస్ రోడ్డులో పస్తాపూర్ వద్ద హైవే బ్రిడ్జిపై నుంచి అదుపుతప్పి లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. జహీరాబాద్ టౌన్ ఎస్ఐ కాశీనాథ్ కథనం మేరకు.. ఐరన్ స్క్రాప్ లోడ్తో హైదరాబాద్ నుంచి బీదర్ వైపు వెళ్తున్న లారీ బైపాస్ రోడ్డులో పస్తాపూర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుంచి సర్వీస్ రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ వైఎస్ఆర్ కడప జిల్లా లింగాల గ్రామానికి చెందిన రమేశ్(45) క్యాబిన్లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. క్లీనర్ సత్యసాయి జిల్లా నాగసముద్రంకు చెందిన పాముల వీరేశానికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

బ్రిడ్జిపై నుంచి లారీ బోల్తా