
గురుకులాల కార్యదర్శిని సస్పెండ్ చేయాలి
నిజాంపేట(మెదక్): గురుకుల విద్యార్థులు బాత్ రూమ్లు కడగాలని, తరగతి గదులు శుభ్రం చేసుకోవాలని అవమానపరిచిన గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణిని తక్షణమే సస్పెండ్ చేయాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ డిమాండ్ చేశారు. నిజాంపేటలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులను కులం పేరుతో అవమానపర్చడమే కాకుండా బానిసల కంటే హీనంగా అవమానపర్చడం తగదన్నారు. తన క్లీనింగ్ ఆదేశాలను ప్రశ్నించే తల్లిదండ్రులు, పిల్లలపై చర్యలు తీసుకోవాలని హుకూం జారీ చేయడం సిగ్గు చేటన్నారు. తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నిజాంపేట మాజీ ఉప సర్పంచ్ కొమ్మట బాబు, డీబీఎఫ్ మండల అధ్యక్షుడు బ్యాగరీ చంద్రం, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గరుగుల శ్రీనివాస్, బ్యాగరి రాజు, ఎండీ యాదుల్, తదితరులు పాల్గొన్నారు.