
నాసిరకంగా జాతీయ రహదారి పనులు
మూడు నెలలకే పగుళ్లు
కోహెడరూరల్(హుస్నాబాద్): సిద్దిపేట నుంచి హన్మకొండ జాతీయ రోడ్డు విస్తరణ పనుల్లో నాణ్యత లోపం బయట పడుతుంది. మండలంలోని బస్వాపూర్ గ్రామ శివారులో పలు చోట్ల బీటీ రోడ్డుకు పగుళ్లు, గుంతలు ఏర్పడ్డాయి. రూ.కోట్లు వెచ్చించి నిర్మిస్తున్న రోడ్లు ముణ్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. కాంట్రాక్టర్ త్వరగా పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో నాణ్యతను పట్టించుకోకుండా హడావిడిగా రోడ్డు విస్తరణ పనులు చేసేసి చేతులు దులుపుకున్నట్లు గ్రామస్తులు, వాహనదారులు విమర్శిస్తున్నారు.
నిజాయితీ చాటుకున్న
ఆర్టీసీ కండక్టర్
హుస్నాబాద్: హుస్నాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో ఆదివారం చెంచు లక్ష్మణ్ అనే వ్యక్తి సిద్దిపేట నుంచి సముద్రాల వరకు ప్రయాణించాడు. లక్ష్మణ్ రూ.20 వేలు విలువ చేసే సెల్ ఫోన్ను బస్లో మరిచిపోయాడు. ఆ సెల్ఫోన్ను తీసుకున్న కండక్టర్ తిరుపతి కంట్రోలర్కు అప్పగించాడు. ఫోన్ను ఆర్టీసీ సిబ్బంది తిరిగి ప్రయాణికుడు లక్ష్మణ్కు అప్పగించారు.
ఇద్దరు అదృశ్యం
డ్యూటీకి వెళ్తున్నానని యువతి
పటాన్చెరు టౌన్: డ్యూటీకి వెళ్తున్నానని ఇంటి నుంచి వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మహారాష్ట్రకు చెందిన వైశాలీ(24) కుటుంబ సభ్యులతో కలిసి బతుకుదెరువు కోసం వచ్చి తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పోచారంలో ఉంటుంది. ఓ ప్రైవేట్ స్కూల్ బస్సులో అటెండర్గా పని చేస్తుంది. శనివారం డ్యూటీకి వెళ్తున్నానని ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. కూతురి అదృశ్యంపై తల్లి మహానంద ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
బంధువుల ఇంటికెళ్తున్నానని బాలిక
బంధువుల ఇంటికి వెళ్తున్నానని ఇంటి నుంచి వెళ్లి బాలిక అదృశ్యమైంది. అమీన్పూర్ పోలీసుల కథనం మేరకు... అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ కాలనీకి చెందిన బాలిక శనివారం బంజారాహిల్స్లో ఉండే తమ బంధువుల ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా స్పందించలేదు. బాలిక అదృశ్యంపై ఆదివారం తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

నాసిరకంగా జాతీయ రహదారి పనులు