
చెడు వ్యసనాలకు బానిస కావొద్దు
డీసీపీ మధుకర్ స్వామి
దుబ్బాకటౌన్ : యువత చెడు వ్యసనాలకు బానిస కావొద్దని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డీసీపీ మధుకర్ స్వామి, ప్రొఫెసర్ కే.హుస్సేన్ అన్నారు. ఆదివారం కూకట్పల్లి ఎస్ఐ తౌడ సత్యనారాయణ ఆధ్వర్యంలో దుబ్బాకలో అఖిలా రాజ్ ఫౌండేషన్ ఆవిర్భావ సభలో కరపత్రం విడుదల చేసి మాట్లాడారు. మారుతున్న టెక్నాలజీకి అనుకూలంగా యువత మారాల్సిన అవసరం ఉందన్నారు. సమాజ సేవను యువత సామాజిక బాధ్యతగా భావించాలని, అప్పుడే సమాజంలో అసమానతలు తొలగిపోతాయన్నారు. అఖిలా రాజ్ ఫౌండేషన్ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వర్తించి సమాజంలో తనదైన పాత్రను పోషించాలని ఆకాంక్షించారు. అనంతరం ఎస్ఐ తౌడ సత్యనారాయణ మాట్లాడుతూ.. తాను పుట్టి పెరిగిన పరిస్థితుల ప్రభావం తనపై అపారంగా ఉందని, చిన్నతనంలో ఎదుర్కొన్న కష్టాలు మరెవరూ ఎదుర్కోవద్దని భావించి ఈ సంస్థను స్థాపించామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద విద్యార్థులకు చేయూత ఇవ్వడమే ఈ సంస్థ ప్రధాన ఆశయమని అన్నారు. కార్యక్రమంలో పోలీస్ ఇన్స్టిట్యూట్ కరస్పాండెంట్ భాగ్య కిరణ్, బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జక్కుల వెంకట్, ఓయూ నాయకులు శ్రీకాంత్, నాయకులు శివకుమార్, వర్తక సంగం నాయకులు రాజు, నాగేందర్, తదితరులు పాల్గొన్నారు.