
ఇంక్రిమెంట్ వేయకపోవడం కక్షపూరితం
క్యాంపులో అధ్యాపకుల నిరసన
సిద్దిపేటఎడ్యుకేషన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు రెండో వార్షిక ఇంక్రిమెంట్ వేయడంతో ప్రిన్సిపాల్స్ వివక్ష చూపుతున్నారని గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కనకచంద్ర అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల(కో ఎడ్యుకేషన్)లో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రంలో భోజన విరామ సమయంలో అధ్యాపకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్స్, అధికారుల మొండి వైఖరి నశించాలి, అధ్యాపకుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినదించారు. అనంతరం కనకచంద్రం మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో రెగ్యులరైన అధ్యాపకులకు మే నెలతో రెండేళ్లు పూర్తయ్యాయన్నారు. మొదటి సంవత్సరం ఇంక్రిమెంట్ చేసిన ప్రిన్సిపాల్స్ రెండో సంవత్సరం కావాలనే కొంతమంది తప్పుడు సూచనలతో నిలిపివేయడం దారుణమన్నారు. పలు కళాశాలల ప్రిన్సిపాల్స్ మే నెల వేతనం సైతం వేయలేదన్నారు. కేవలం కాంట్రాక్టు నుంచి రెగ్యులర్ అయిన అధ్యాపకులకు మాత్రమే కుంటిసాకులు చూపుతూ ఇంక్రిమెంట్ వేయకుండా వివక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి నంట శ్రీనివాస్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గిరి రవి, ప్రధానకార్యదర్శి ధరిపల్లి నగేశ్, కోశాధికారి దుబ్బాక రాజు, మహిళా కార్యదర్శి రమాదేవి, రాష్ట్ర నాయకురాలు వనజ, గిరధర్, మెదక్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి సురేందర్రెడ్డి, జిల్లా, రాష్ట్ర బాధ్యులతోపాటు అధ్యాపకులు పాల్గొన్నారు.