పంట మార్పిడి ఏదీ? | - | Sakshi
Sakshi News home page

పంట మార్పిడి ఏదీ?

Jun 2 2025 7:38 AM | Updated on Jun 2 2025 7:38 AM

పంట మ

పంట మార్పిడి ఏదీ?

● పదేళ్లుగా పడిపోతున్న ఆరుతడి ● మూసపద్ధతులతో దెబ్బతింటున్న భూసారం

నారాయణఖేడ్‌: ఆరుతడి పంటలు ఆదరణ కోల్పోతున్నాయి. రైతులందరూ వాణిజ్య పంటల సాగు వైపే మొగ్గు చూపిస్తుండటంతో భూమి నిస్సారంగా మారే అవకాశముందని వ్యవసాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి పంట మార్పిడి పాటిస్తూ భూసారం దెబ్బతినకుండా కాపాడుకుంటూ పంట సాగు జరగాల్సి ఉండగా జిల్లాలో అందుకు విరుద్ధంగా వ్యవసాయ పనులు సాగుతున్నాయి. ప్రభుత్వం పంటమార్పిడి గురించి వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆశించిన ఫలితాలు రావడంలేదు. దీంతో వ్యవసాయ పరంగా పలు ఇబ్బందులు ఏర్పడే అవకాశముందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ప్రతీ ఏటా వ్యవసాయ శాఖ ఆ ఏడాది జిల్లాలో సాగయ్యే పంటలపై ముందస్తుగా పంటల ప్రణాళికను ఖరారు చేస్తుంది. ఈసారి కూడా మూసపద్ధతిలో గతంలో సాగుచేసిన పంటలే ఈ సారి కూడా పెరగడం, తగ్గుముఖం పట్టిన పంటల సాగు మరింత తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా జిల్లాలో పదేళ్లక్రితం వరకు ఆరుతడి పంటల సాగు భారీ స్థాయిలో జరిగేది. కానీ, ప్రసుత్తం ఆ పరిస్థితి కనిపించడంలేదు. కేవలం వాణిజ్య పంట సాగే అధికంగా ఉంటుంది.

అత్యధికంగా పత్తి...

రైతులు వాణిజ్య పంటల ఉత్పత్తిని గణనీయంగా పెంచేశారు. మార్కెట్‌లో మంచి ధర ఉండటం, దిగుబడులు కూడా బాగా ఉండటంతో రైతులు ఆ పంటలవైపు మళ్లుతున్నారు. ఇందులో ముఖ్యంగా పత్తిపంట నిలుస్తోంది. జిల్లాలో అత్యధికంగా పత్తి పంట ఈ ఏడాది 1,43,817.81 హెక్టార్లలో సాగు జరగనుందని అంచనా వేశారు. ఈ పంటనే జిల్లాలో మొదటి స్థానంలో నిలవనుంది. రెండో స్థానంలో వరి పంట 59,424.7 హెక్టార్లలో సాగయ్యే అవకాశముందని పేర్కొన్నారు. ఈ రెండు పంటలు ప్రతీ ఏటా భారీ స్థాయిలోనే సాగుతున్నాయి.

ఆరుతడి తగ్గుముఖం

పదేళ్లకు పూర్వం జిల్లాలో ఆరుతడి, పప్పుదినుసుల పంటలు భారీస్థాయిలో సాగు జరిగేది. కానీ ఇవి తగ్గుముఖం పడుతున్నాయి. జొన్న 237.25 హెక్టార్లు, మొక్కజొన్న 3,441.3, పెసర 5,749.39, కంది, 32,044.53, మినుము 3,465.59, సోయాబిన్‌ 29,817.81, రాగులు 5.26, సామలు 0.3, స్వీట్‌కార్న్‌ 37.65, ఆముదాలు 5.67, వేరుశెనగ 2.02, బొబ్బర్లు 3.24, ఉలవలు 2.43, ఉద్యావన పంటలు 9,898.79 హెక్టార్లలో సాగు జరగనున్నట్లు అంచనా వేశారు. గత ఐదారేళ్లుగా ఈ పంటల సాగు ఇలాగే ఉంటూ వస్తోంది.

పంట మార్పిడి లేకపోతే నష్టమే

పంటమార్పిడిని కచ్చితంగా చేపట్టాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదు. వాణిజ్య పంట అయిన పత్తి పంటకు మద్దతు ధరకంటే బయటి మార్కెట్‌లో అత్యధికంగా ధర పలకడం, దిగుబడులు కూడా బాగానే ఉండటంతో ఈ పంటపై మక్కువ చూపుతున్నారు. ఆరుతడి పంటల దిగుబడులు తగ్గడం కూడా ఈ పంట పెరిగేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. పెసర, మినుము పంటలు 70రోజుల్లో కోతకు రాగా అదే సమయంలో భారీ వర్షాలు ఉంటాయి. కోత సమయంలో వర్షాలు వచ్చిన పక్షంలో పంట దెబ్బతింటోంది. దీంతో పంట మార్పిడి చేసేందుకు రైతులు ఆసక్తి చూపడంలేదు. పంట మార్పిడి లేకపోవడం వల్ల భూసారం దెబ్బతినే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

3 నుంచి విత్తనాల పంపిణీ

ప్రభుత్వం ప్రతీ గ్రామంలో ఉత్తమ రైతులను ఎంపిక చేసి యూనివర్సిటీ నుంచి తెప్పించిన పప్పుదినుసులైన కంది, మినుము, పెసర పంటల మేలు రకం విత్తనాలు ఇచ్చి సాగు చేయించి ఉత్పత్తి అయిన పంటను సేకరించి విత్తనంగా మారుస్తారు. దీన్నే సదరు గ్రామంలోని రైతులకు విక్రయించి పప్పుదినుసుల సాగును ప్రోత్సహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 3 నుంచి విత్తనాల పంపిణీ చేపట్టనున్నారు.

పంట మార్పిడి ఏదీ?1
1/1

పంట మార్పిడి ఏదీ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement