
వన మహోత్సవానికి వేళాయె
● ఈ ఏడాది 34.05లక్షల మొక్కలు నాటాలని నిర్ణయం ● వివిధ శాఖల సిబ్బందితోమొక్కలు నాటించనున్న అధికారులు ● ప్రత్యేక దృష్టి సాగిస్తున్న సిబ్బంది
సంగారెడ్డి టౌన్ : పర్యావరణ పరిరక్షణకు రాష్ట్రప్రభుత్వం 11 వ విడత వనమహోత్సవ కార్యక్రమాన్ని త్వరలోనే చేపట్టనుంది. అందులోభాగంగా జిల్లావ్యాప్తంగా పంచాయతీలలో నర్సరీలను ఏర్పాటుచేసి మొక్కలను పెంచేలా చర్య లు తీసుకుంది. ఈ నర్సరీల నిర్వహణకు సుమారు రూ3.42 కోట్లను ఖర్చు చేస్తున్నారు. అధికారులు ఇప్పటివరకు పది విడతలుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. 11వ విడతగా 34,05,850 మొక్కలను నాటాలని లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. ఇప్పటికే మొక్కలు పెంచుతూ, వాటిని సంరక్షిస్తున్నారు. ఎండలో మొక్కలు ఎండిపోకుండా నర్సరీల్లో గ్రీన్ షెడ్ నెట్లు ఏర్పాటు చేసి వాటిని రక్షించారు.
ఇవీ అందుబాటులో ఉన్న మొక్కలు
ఆయా పంచాయతీల లక్ష్యాలకు అనుగుణంగా అదే గ్రామంలోని నర్సరీలో మొక్కలు పెంచారు. ప్రధానంగా జామ, నిమ్మ, దానిమ్మ, ఈత, వేప, ఉసిరి, చింత, వివిధ రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఈతవనాలను చెరుపు కట్టలు, ఇతర ప్రదేశాల్లో నాటడానికి అబ్కారీశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇక మిగతా మొక్కలను ఆసక్తి ఉన్న రైతులు పెంచుకోవచ్చు. కొన్ని పంచాయతీల్లో ఇతర మొక్కలు కూడా పెంచుతున్నారు. అక్కడి రైతుల ఆసక్తి మేరకు వాటి పెంపకానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇక ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేస్తున్నారు. మొక్కలను వివిధ శాఖల ఆధ్వర్యంలో నాటడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ మొక్కను నాటి దాని చుట్టూ కంచెవేసి వాటికి నీరు అందించి మొక్కను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ప్రతీరోజు నీరు పోయడానికి వన సేవకులను నియమించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో మొక్కలను నాటడానికి ఏర్పాట్లను సిద్ధం చేశారు.
వీటిని నాటడంతో పాటు రక్షించే బాధ్యతలను ఆయా విభాగాలకు చెందిన అధికారులు తీసుకోనున్నారు. ప్రతీ ఇంటికి 6 మొక్కలను అందించి వాటిని రక్షించాల్సిన బాధ్యత కూడా సదరు యజమానులకు అప్పగించనున్నారు.
వివిధ శాఖలకు కేటాయించిన మొక్కలు
దేవాదాయ 750
ఎకై ్సజ్ 2.75 లక్షలు
అటవీ 12 లక్షలు
ఉద్యాన 75 వేలు
పరిశ్రమలు 75 వేలు
ఎన్హెచ్ఏఐ/ఆర్ అండ్ బి 75 వేలు
నీటిపారుదల 18,750
హోమ్ 3,750 విద్యా 750
సంక్షేమ 1000
పశుసంవర్ధక 750
జైళ్ల 750
మాతా శిశు సంక్షేమం 1,100
అర్బన్ ఏరియా 4,57,500
మొక్కలు సిద్ధం చేశాం
నర్సరీల్లో మొక్కల పెంపకంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వేసవిలో ఎండలు అధికంగా ఉన్నప్పటికీ గ్రీన్షెడ్స్ వేసి సంరక్షించారు. కొన్ని చోట్ల మినహాయిస్తే ప్రతీచోట చక్కగా పెరిగాయి. త్వరలోనే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. – మణికుమార్, జిల్లా ప్లాంటేషన్ మేనేజర్

వన మహోత్సవానికి వేళాయె

వన మహోత్సవానికి వేళాయె