దోమ: ఇంటి స్థలం (ప్లాట్) విషయంలో జరిగిన గొడవతో మనస్తాపానికి గురైన ఓ హోంగార్డ్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. మండల పరిధిలోని బాస్పల్లికి చెందిన తలారి వెంకటయ్య(47) వికారా బాద్ ఎస్పీ కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రామంలోని తమ ఇంటి వెనక ఉన్న అరవై గజాల స్థలాన్ని వెంకటయ్య తండ్రి నలభై ఏళ్ల క్రితం ఇదే ఊరికి చెందిన కుందేళ్ల చంద్రయ్య వద్ద కొనుగోలు చేశాడు. ఇప్పటివరకు సదరు స్థలానికి ఫెన్సింగ్ వేయలేదు. ఇటీవల వెంకటయ్య కడీలు పాతుతుండగా చంద్రయ్య మనమడు మల్లేశ్ అడ్డుకున్నాడు. స్థలం తమదేనని గొడవపడటంతో పాటు కడీలను ధ్వంసం చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన వెంకటయ్య పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ అనంతయ్య పోలీసులకు సమాచారం అందించగా, మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య విజయలక్ష్మి, ముగ్గురు కూతుళ్లు ఉండగా, పెద్ద కూతురు అశ్విని వివాహం జరిగింది. ఇద్దరు కూతుళ్లు వైష్ణవి, అక్షిత ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు మల్లేశ్పై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ వసంత్జాదవ్ తెలిపారు.


