● కంటైనర్ను ఢీకొట్టిన కారు
● ఇద్దరు షార్ట్ఫిల్మ్ యాక్టర్ల దుర్మరణం
ఇబ్రహీంపట్నం రూరల్: ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు షార్ట్ ఫిల్మ్ యాక్టర్లు దుర్మరణం చెందారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ నోయల్రాజ్ తెలిపిన ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా వేదాయపాలెంకు చెందిన కత్తి భరత్కాంత్(31), గూడ సాయి త్రిలోక్(31) షార్ట్ఫిల్మ్ యాక్టర్లు. శనివారం సాయంత్రం నెల్లూరు నుంచి కారులో హైదరాబాద్కు బయలుదేరారు. ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్ వైపు వెళ్తున్నారు. బొంగ్లూర్ ఎగ్జిట్–12 సమీపంలో కారు డ్రైవర్ అతివేగంగా వెళ్లడంతో వాహనం అదుపుతప్పి ఎదరుగా వెళ్తున్న కంటైనర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న కత్తి భరత్కాంత్, గూడ సాయి త్రిలోక్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ఆదివారం తెల్లవారు జామున 3.20గంటల సమయంలో ఓఆర్ఆర్ పెట్రోలింగ్ అధికారి శ్రీకాంత్ ఇచ్చిన సమాచారం మేరకు ఆదిబట్ల పోలిసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా ఇద్దరు మృతి చెందినట్లు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
భరత్ కాంత్ (ఫైల్)
గూడ సాయి త్రిలోక్ (ఫైల్)


