ఇంటికొస్తానన్నాడు.. అంతలో హతమయ్యాడు | - | Sakshi
Sakshi News home page

ఇంటికొస్తానన్నాడు.. అంతలో హతమయ్యాడు

May 11 2026 9:49 AM | Updated on May 11 2026 9:49 AM

షాద్‌నగర్‌రూరల్‌: వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ సీతారాం కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట్‌ మండలం పోమాల్‌ గ్రామానికి చెందిన పల్లెకేశవులు (39) పద్మ దంపతులు. షాబాద్‌ మండల పరిధిలోని సర్దార్‌నగర్‌లో శ్రీనివాస్‌రావుకు చెందిన ఫాంహౌస్‌లో పని చేయడంతో పాటు వ్యవసాయంచేస్తూ పిల్లతో కలిసి అక్కడే నివసిస్తున్నారు. ఈ నెల 9న (శనివారం) తన సొంత ఊరులోని భూమికి సంబంధించిన కేసు విషయం మాట్లాడేందుకు వెళ్లాలని పల్లెకేశవులు యజమాని వద్ద రూ.50 వేలు తీసుకొని వెళ్లిపోయాడు. అదేరోజు తన సోదరులతో కలిసి పరిగి వెళ్లి అక్కడ అడ్వకేట్‌తో కేసు విషయం మాట్లాడి రాత్రి తిరుగు పయనమయ్యారు. రాత్రి 9.30 గంటల సమయంలో షాద్‌నగర్‌ బస్టాండ్‌కు వచ్చాను, ఇంటికి వస్తాను అని భార్య పద్మకు ఫోన్‌చేసి చెప్పాడు. ఇంటికి చేరుకోలేదు. పట్టణ సమీపంలోని వీర్లపల్లి రోడ్డులోగల వెంచర్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృత దేహం ఉన్నట్లు ఆదివారం ఉదయం వెంచర్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ సీతారాం సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. తలపై తీవ్ర గాయాలు ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. మృతదేహాన్ని పరిశీలిస్తున్న సమయంలో మృతుడి సెల్‌ఫోన్‌కు భార్య ఫోన్‌ చేయడంతో విషయాన్ని ఆమె తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఆమె హత్యకు గురైంది తన భర్తనే అని తెలిపింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

మధ్యలో ఏం జరిగిందో ఏమో?

Advertisement
 
Advertisement
Advertisement