షాద్నగర్: శ్రామికులు తమ హక్కులను విధిగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని శంషాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సామ రవీందర్రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని లేబర్ అడ్డాలో కూలీలకు వారి హక్కులు బాధ్యతలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెక్కాడితే గాని డొక్కాడని శ్రమ జీవులు అనునిత్యం ఎంతో కష్టపడి పనిచేస్తున్నారన్నారు. రోజు పనిచేస్తేనే కానీ వారి కడుపునిండని పరిస్థితి నెలకొందన్నారు. శ్రామికుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. వాటిని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళా కార్మికులు ప్రసూతికి రూ.20వేల చొప్పున పొందే హక్కు ఉందని చెప్పారు. అదేవిధంగా కార్మికులు ప్రమాదాల బారిన పడినప్పుడు ప్రభుత్వం ఐదు లక్షల పరిహారం అందిస్తోందని తెలిపారు. అదేవిధంగా కార్మికుల కోసం వృత్తి శిక్షణ కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. కార్మికులు ఏదైనా న్యాయ సహాయం అవసరం అయితే రాష్ట్ర న్యాయ సేవా సాధికార సంస్థను ఆశ్రయించవచ్చని సూచించారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్
డాక్టర్ సామ రవీందర్రెడ్డి


