దేవదేవుని ఆదేశంతోనే.. | - | Sakshi
Sakshi News home page

దేవదేవుని ఆదేశంతోనే..

May 9 2026 9:37 AM | Updated on May 9 2026 9:37 AM

ఉదయం 8 నుంచే వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు కొడంగల్‌ సభకు చేరుకోవడం ప్రారంభించారు.

ఉ. 9.30కు సభా ప్రాంగణం జనం, నాయకులు, కార్యకర్తలతో నిండిపోయింది.

భాషా సాంస్కృతిక శాఖ కళా బృందం సభ్యులు అన్నమయ్య కీర్తనలు, భక్తి గీతాలు ఆలపించారు.

మధ్యాహ్నం 12 గంటలకు నగరం నుంచి సీఎం రేవంత్‌రెడ్డి హెలిక్యాప్టర్‌లో కొడంగల్‌కు చేరుకున్నారు.

మ.12.06కు మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి కాన్వాయిలో పట్టణంలోని శ్రీవారి ఆలయానికి బయలుదేరారు.

మ. 12.10కు ప్రత్యేక వాహనంలో సీఎం పట్టు వస్త్రాలు ధరించారు.

మ. 12.18కు మహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ పునర్‌ నవీకరణ పనులకు భూమిపూజ చేశారు.

మ. 12.48కు ఆలయం పక్కనే ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

సీఎంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యే లు, కలెక్టర్‌, అధికారులు సంప్ర దాయ దుస్తులతో హాజరయ్యారు.

మ. 12.50కు రాష్ట్ర గీతంతో బహిరంగ సభ ప్రారంభమైంది.

మ. 12.56కు మంత్రులు వాకిటి శ్రీహరి, దామోదర రాజనరసింహప్రసంగించారు.

మ. 1.01 నుంచి 1.31 గంటల వరకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

మహిళలు ఇందిరమ్మ చీరలతో సభకు వచ్చారు. వారిని సీఎం పాలపిట్టలతో పోల్చారు.

ఈ జన్మకు వచ్చిన గొప్ప అవకాశం ఇది

2027 డిసెంబర్‌లోపుపనులు పూర్తి కావాలి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం

కొడంగల్‌: ఆ దేవదేవుని ఆదేశం మేరకు కొడంగల్‌లో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ జన్మకు వచ్చిన గొప్ప అవకాశంగా అభివర్ణించారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేసి 2027 డిసెంబర్‌ లోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని పద్మావతీ సమేత శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ పునర్‌నవీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.110 కోట్ల వ్యయంతో ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. తిరుమల తరహాలో నాలుగు మాఢ వీధులు, పుష్కరిణి, అన్నదాన సత్రం, కల్యాణ మండపం, ధ్వజ స్తంభం, ప్రధాన ఆలయం, అమ్మవార్ల ఆలయాలు, ఉప ఆలయాలు, క్యూలైన్‌, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గదులు, పార్కింగ్‌, ప్రసాద కౌంటర్ల నూతన భవనాల నిర్మాణానికి భూమిపూజ చేశారు. తిరుమల నుంచి వచ్చిన అర్చకులు వైదిక కార్యక్రమాలను వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రత్యేకంగా సిద్ధం చేసిన యాగశాలలో హోమం తదితర పూజలు నిర్వహించారు. ఉదయం కుంభారాధన, చతుర్వేద శిలలకు అభిషేకం, హోమాలు, పుర్ణా హుతి జరిపించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రథమ శిలేష్టికాన్యాస (శంకుస్థాపన) కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దుద్యాల్‌ మండలం లగచర్లలో 430 పడకల ఆస్పత్రికి, కోస్గిలో వేణుగోపాల స్వామి ఆలయానికి, దౌల్తాబాద్‌లోని వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు ఇక్కడే శిలాఫలకాలకు పూజ చేశారు.

కొడంగల్‌ను నందనవనంగా తీర్చిదిద్దాలి

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. 55 ఏళ్ల క్రితం నందారం కుటుంబీకులు నిర్మించిన కొడంగల్‌ ఆలయాన్ని అభివృద్ధి చేసే అవకాశం తనకు వచ్చిందన్నారు. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే తిరుమలకు వెళ్లి వచ్చి న పుణ్యం వస్తుందన్నారు. శ్రీవారి ఆలయానికి ఎంతో సేవ చేసిన టీటీడీ వైఖానస ఆగమ శాస్త్ర సలహాదారులు, దివంగత సుందర వరధ భట్టాచార్యుల పేరును ఏదో ఒక ప్రాంగణానికి పెట్టాలని అధికారులకు సూచించారు. గడి గుడి ఏకమై కొడంగల్‌ను నందనవనంగా తీర్చిదిద్దాలన్నారు. తిరుమల తరహాలో నిత్య పూజలు, కైంకర్యాలు జరుగుతున్నాయని చెప్పారు. నారాయణపేట ఎత్తిపోతల పథకం, కృష్ణా – వికారాబాద్‌ రైల్వే లైన్‌, కొడంగల్‌ మండలంలో సిమెంట్‌ ఫ్యాక్టరీ పనులు త్వరలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, బుయ్యని మనోహర్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీనివాస రాజు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యారు, కలెక్టర్‌ దీపక్‌ తివారి తదితరులు పాల్గొన్నారు.

సీఎం సభ సైడ్‌ లైట్స్‌

Advertisement
 
Advertisement
Advertisement