రాజేంద్రనగర్: ఆరాంఘర్ చౌరస్తా నుంచి మెహిదీపట్నం సరోజినీ దేవి కంటి ఆసుపత్రి వరకు ఉన్న పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వేపై వాహన వేగాన్ని తగ్గించి ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. 11.6 కిలోమీటర్ల మేర పీవీఆర్ ఎక్స్ప్రెస్ వేతో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వెళ్లే వారికి ఎంతో సౌలభ్యంగా ఉంది. ఫ్లైఓవర్పై కార్లకు మాత్రమే అనుమతి ఉంది. ప్రస్తుతం వాహనాలు వేగంగా వస్తూ నిత్యం ప్రమాదాలకు గురవుతున్నాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్న ప్రాంతాలను గుర్తించి 80 కి.మీ వేగంతో మాత్రమే వెళ్లాలంటూ బోర్డులను ఏర్పాటు చేశారు. దీనికి తోడు ఇరువైపులా లేజర్ గన్లను ఏర్పాటు చేశారు. 80 కి.మీ కంటే ఎక్కువ వేగంతో వెళ్లే వాహనాలను గుర్తించి చలానాలు వేస్తున్నారు. ప్రతిరోజు 120 నుంచి 150 వాహనాలకు చలానాలు విధిస్తు న్నారంటే.. ఫ్లై ఓవర్పై వాహనాలు ఎంత వేగంగా వెళ్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.


