అబ్దుల్లాపూర్మెట్: పంటలకు గిట్టుబాటు ధరను కల్పించడంతో పాటు రైతులను ఆదుకోవడంలో ప్రజాప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోందని గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం బాటసింగారం పండ్ల మార్కెట్ కార్యాలయంలో రైతువారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు వాటి అమలు తీరుపై అవగాహన కల్పించారు. రైతు సంక్షేమానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతు ప్రయోజనాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ భాస్కర చారి, సభ్యులు బండి మధుసూదన్ రావు, మచ్చేందర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, నర్సింహ,అంజయ్య, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్రెడ్డి


