యాచారం: వీధి కుక్కల దాడిలో జింక మృతి చెందింది. వివరాలు.. మండల పరిధిలోని మాల్–కొత్తపల్లి గ్రామాల మధ్య ప్రభుత్వ భూమిలోని గుట్టల ప్రాంతం నుంచి బుధవారం ఓ జింక కిషన్పల్లి సమీపంలోకి వచ్చింది. ఇది గమనించిన వీధి కుక్కలు జింకను వెంటాడి దాడి చేసి చంపేశాయి. గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు వచ్చి కళేబారాన్ని అటవీ ప్రాంతంలో ఖననం చేశారు.
ఇద్దరు డ్రైవర్లపై కేసు
షాబాద్: నాగర్గూడ ఈసీ వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇద్దరు డ్రైవర్లపై కేసు నమోదు చేశారు. షాబాద్ ఎస్ఐ రమేశ్ తెలిపిన ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి నాగర్గూడ సమీపంలోని ఈసీ వాగునుంచి ఇసుకను తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని జేసీబీ సాయంతో ట్రాక్టర్లు, టిప్పర్ల ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించారు. పోలీసుల రాకను గమనించిన డ్రైవర్లు అక్కడ నుంచి తప్పించుకున్నారు. జేసీబీని ఠాణాకు తరలించి సీజ్ చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
సైబరాబాద్,హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 98 మందికి పాజిటివ్
సాక్షి, సిటీబ్యూరో: శాంతి పరిరక్షణలో భాగంగా సైబరాబాద్ పోలీసు శాఖ నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా ఘర్షణలు, దాడులకు దిగేవారిపై రౌడీ షీట్లను తెరుస్తోంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు రౌడీ షీటర్లకు బుధవారం ఆకస్మిత డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 128 మంది రౌడీ షీటర్లకు డ్రగ్స్ టెస్ట్లు నిర్వహించగా.. 11 మందికి పాజిటివ్ వచ్చింది. మిగతావారికి 117 మందికి నెగిటివ్ వచ్చింది. కాగా.. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 204 మంది రౌడీషీటర్లకు పరీక్షలు నిర్వహించగా.. 87 మంది డ్రగ్స్ సేవించినట్లు (పాజిటివ్) నిర్ధారణ అయింది.


