షాద్నగర్రూరల్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి తక్షణమే చర్యలు చేపట్టాలని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పది లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 11 ఏళ్ల క్రితం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు కనీసం లక్ష ఎకరాలకు నీళ్లవ్వలేదని, ప్రాజెక్టు 90శాతం పూర్తయిందని ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన సీఎం రేవంత్రెడ్డి 10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించిన తరువాతే మిగతా ప్రాంతాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల జేఏసీ నాయకులు అర్జునప్ప, టీజీ శ్రీనివాస్, నర్సింలు, రాము, సత్యం, రవికుమార్, తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు.


