బహదుర్పురా: తాడ్బన్ వద్ద మూడు షాపుల్లో గురువారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయణికులు సమాచారం ఇవ్వడంతో బహదుర్పురా పోలీసులు వెంటనే 8 ఫైరింజన్లతో సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. పోలీసుల కథనం ప్రకారం... అబ్దుల్ సలీం, అబ్దుల్ హై, అలీలు తాడ్బన్లో కొంతకాలంగా ఉడ్ వర్క్, ఫైబర్ షీట్ షీల్డ్, ఏషియన్ పెయింట్ పాపులను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో షాపులను యధావిధిగా మూసివేశారు. అయితే 11.30 గంటల ప్రాంతంలో పాపుల నుంచి పెద్ద ఎత్తున మంటలు రావటాన్ని స్థానికులు, ప్రయణికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఐదు గంటలు శ్రమించి ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు, బహదుర్పురా ఎమ్మెల్యే మహ్మద్ మోబిన్, స్థానిక కార్పొరేటర్లు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై ఆరా తీశారు. ఒక షాపు నుంచి మరో రెండు షాపులకు మంటలు విస్తరించడంతో ప్లైవుడ్స్, పెయింట్, ఇతర ఫైబర్ వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. శుక్రవారం సాయంత్రం మళ్లీ పొగలు వ్యాపించడంతో చందులాల్ బారాదరి ఫైర్ అధికారులు మొగల్పురా నుంచి ఫైరింజన్ తెప్పించి అదుపుచేశారు. అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న ఏషియన్ పెయింట్ యాజమని అలీ షాక్కు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో రూ.10 లక్షలకుపైగా ఆస్తి నష్టం జరిగినట్లు షాపుల యాజమానులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసున్నారు.
షాపు యజమానులపై కేసు..
ఫైర్ సేఫ్టీ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని గతంలో పోలీసులు షాపుల యాజమనులకు సూచించినా పెడ చెవిన పెట్టారు. వారి నిర్లక్ష్యం కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు యజమానులు అబ్దుల్ సలీం, అలీ, అబ్దుల్ హైపై కేసు నమోదు చేశారు.
5 గంటలు శ్రమించి మంటలను ఆర్పివేసిన పోలీసులు, ఫైర్ సిబ్బంది
తాడ్బన్లో ఘటన.. రూ.లక్షల్లో ఆస్తినష్టం


