అబ్దుల్లాపూర్మెట్ : విద్యుత్ తీగలు అల్లుకోవడంతో వచ్చిన నిప్పుతో గడ్డివాము దగ్ధమైంది. ఈ సంఘటన అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాటసింగారం గ్రామంలోని సింగరేణికాలనీలో శుక్రవారం మధ్యాహ్నం రెండు విద్యుత్ తీగలు తగలడంతో నిప్పు రవ్వలు చెలరేగి సమీపంలో ఉన్న దర్నమోని లోకనాథంకు చెందిన ఎండు గడ్డి వాముపై పడ్డాయి. దీంతో గడ్డివాము కాలిబూడిదైంది. వెంటనే అప్రమత్తమైన బాధితుడు సమీపంలోనే ఉన్న పశువులకు ఎలాంటి హాని జరగకముందే దూరంగా తీసుకెళ్లాడు.
ఉద్యోగాల పేరుతో మోసం
మేడిపల్లి: ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం... అమీన్పూర్కు చెందిన వినయ్ రెడ్డి, బంధువు రిషితారెడ్డిలకు బోడుప్పల్కు చెందిన యశ్వంత్ రెడ్డి 2025 ఆగస్టులో లింక్డ్ఇన్ ద్వారా పరిచయమయ్యాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికిన యశ్వంత్రెడ్డి వారి వద్ద నుంచి రూ.8 లక్షలు వసూలు చేశాడు. అనంతరం కొన్నిరోజులు శిక్షణ పేరుతో నమ్మకం కలిగించాడు. నెల జీతం కూడా చెల్లించాడు. ఆ తరువాత మొహం చాటేశాడు. ఫోన్ చేస్తే స్పందించడం మానేశాడు. చివరకు వారి ఫోన్ నెంబర్లను బ్లాక్ చేసి పరారయ్యాడు. మోసపోయామని గ్రహించిన బాధితులు శుక్రవారం మేడిపల్లి పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


