టేబుళ్లపై గుట్టలుగా ఫైళ్లు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పరిపాలనలో పారదర్శకత, సత్వర సేవల కోసం ప్రభుత్వ వ్యవహారాలన్నీ ఆన్లైన్లోని నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ–ఆఫీసు సేవలను అమల్లోకి తెచ్చింది. ప్రతిశాఖ ఈ–ఆఫీసు ద్వారానే కార్యకలాపాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) ద్వారా ఇప్పటికే జిల్లా అధికారులు, సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. ప్రతి అధికారికి ఒక ప్రత్యేక ఐడీ క్రియేట్ చేసి, పాస్ వర్డ్లను జారీ చేశారు. క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారికి పంపే ఫైళ్లన్నీ ఇకపై ఈ ఆఫీసు ద్వారానే పంపాలనే నిబంధన కూడా విధించారు. జిల్లాలో మాత్రం మెజార్టీ శాఖలు ఇప్పటికీ మాన్యూవల్గానే రోజువారీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. విద్య, వైద్య ఆరోగ్యశాఖ సహా కీలక విభాగాల్లోనూ ఇప్పటికీ మాన్యూవల్ పద్ధతే కొనసాగుతోంది. అభివృద్ధి పనులకు సంబంధించి ఆయా ప్రభుత్వశాఖలు జారీ చేసే ప్రొసీడింగ్స్ మొదలు.. బిల్లుల చెల్లింపుల వరకు అంతా మాన్యువల్గానే కొనసాగిస్తున్నారు.
పాడైపోయిన స్కానర్లు
జిల్లాలో రెవెన్యూ, పంచాయతీరాజ్, జిల్లా గ్రామీణాభివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమం, ట్రెజరరీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు సహా 50కిపైగా విభాగాలు ఉన్నాయి. ఒక్కో విభాగానికి ఒక్కో ఉన్నతాధికారి ఉంటారు. రాబోయే రోజులన్నీ సాంకేతిక పరిజ్ఞానంపైనే ఆధారపడి ఉంటాయని ప్రభుత్వం భావించింది. ఆ మేరకు జిల్లా ప్రజలకు సత్వర, సులభమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో అన్ని విభాగాల్లో ఈ–ఆఫీసు విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పెద్ద మొత్తంలో కంప్యూటర్లు, స్కానర్లు కొనుగోలు చేసి ఆయా విభాగాలకు అందజేసింది. మెజార్టీ కంప్యూటర్లు, స్కానర్లు పాడైపోయాయి. ఉన్న వాటిని అప్డేట్ చేయలేదు. సాఫ్ట్వేర్ వర్షన్ కూడా మారడంతో స్కానర్లు పని చేయని పరిస్థితి నెలకొంది. వీటి రిపేర్లకు ఆయా శాఖల వద్ద ఆశించిన స్థాయిలో బడ్జెట్ లేకపోవడం ఇబ్బందిగా మారింది.
భూభారతిలో అందిన దరఖాస్తులు, క్షేత్రస్థాయి నుంచి అందిన కీలక నివేదికలు, అధికారులు జారీ చేసే ప్రొసీడింగ్స్ అన్నీ ఇప్పటికీ మాన్యువల్గానే కొనసాగుతున్నాయి. ఐటీకి కేంద్రబిందువైన జిల్లాలో ఆశించిన స్థాయిలో ఈ ఆఫీసు సర్వీసులు అందకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కీలకమైన రెవెన్యూ విభాగంలో ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ తుది నివేదికలను ఇప్పటికీ మ్యాన్యువల్గానే అందించాల్సి వస్తోంది. ఆన్లైన్లోనే యాక్సెప్ట్/ రిజెక్ట్ చేసి అవకాశం ఉన్నప్పటికీ మాన్యువల్గా వచ్చిన ఫైళ్లను చూ సిన తర్వాతే సంతకాలు చేస్తుండటం గమనార్హం. విద్యాశాఖ సహా ఫుడ్ కంట్రోల్ విభాగం, తూనికలు కొలతలు, సీ్త్ర శిశు సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ శాఖలు, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ, పంచాయతీరాజ్శాఖ, సహకారశాఖ, మైనింగ్ విభాగం, ఎస్సీ కార్పొరేషన్, అడల్ట్ ఎడ్యుకేషన్, మత్స్యశాఖ, సివిల్ సప్లయ్ విభాగం సహా కీలక విభాగాలు ఇప్పటికీ మాన్యువల్గానే కార్యకలాపాలు కొనసాగిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయా అధికారుల టేబుళ్లపై గుట్టలుగా ఫైళ్లు పేరుకపోయి కన్పిస్తున్నాయి.
స్కానర్లు కరువు.. కంప్యూటర్లు పని చేయవు
ప్రభుత్వ విభాగాల్లో కనిపించని ఆన్లైన్ సేవలు
ప్రొసీడింగ్స్ సహా నివేదికలన్నీ మాన్యువల్గానే..
ఫైళ్ల క్లియరెన్స్లో ఎడతెగని జాప్యం


