ఇబ్రహీంపట్నం రూరల్: కొంగరకలాన్లో హైడ్రా అధికారులు పర్యటించారు. ఓ కన్వెన్షన్ హాల్ పక్కన ఉన్నటువంటి స్థలాన్ని మంగళవారం హైడ్రా ఇన్స్పెక్టార్ సైదులు పరిశీలించారు. భూ పరిరక్షణ సమితి ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పర్యటించినట్లు చెప్పారు. పూర్తి స్థాయిలో విచారణ అనంతరం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
తుక్కుగూ: డివిజన్ పరిధిలోని ఇమూమ్గూడలో ఉన్న గ్రేస్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె.లలితాదేవి ఆదేశాల మేరకు కందుకూరు డివిజన్ ఉప వైద్యధికారి డాక్టర్ గీత మంగళవారం సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆస్పత్రి నిర్వహణ, రోగుల సేవల విషయంలో లోపాలను గుర్తించామన్నారు. యాజమాన్యానికి పలుమార్లు నోటీసులు జారీ చేసినా సరి చేయలేదన్నారు. దీంతో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు సీజ్ చేశామన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
శంకర్పల్లి: మోకిల సీఐ వీరబాబును బదిలీ చేస్తూ ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్బాబు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనని కమిషనరేట్లోని క్రైం విభాగానికి బదిలీ చేయగా.. ఆయన స్థానంలో శ్రీనివాస్రెడ్డిని నియమించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేశామని, ప్రజలు సైతం మంచి సహకారాన్ని అందించారని వీరబాబు గుర్తు చేసుకున్నారు. నూతన సీఐ శ్రీనివాస్ రెడ్డి బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అనంతగిరి: అనంత పద్మనాభస్వామి ఆలయ భూములను కౌలుకు ఇచ్చేందుకు గాను మే 2న వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త ఎన్ పద్మనాభం, ఈఓ టీ నరేందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు ఆలయ ప్రాంగణంలో వేలం ఉంటుందని తెలిపారు. వేలం హక్కులు పొందిన వారు మూడేళ్ల పాటు(మే 05 నుంచి ఏప్రిల్ 30 2029 వరకు) వ్యవసాయం చేసుకోవచ్చని తెలిపారు. వికారాబాద్ మండలం గుడుపల్లి సర్వే నంబర్ 65లో 328 ఎకరాలు, కొత్తగడి గ్రామ సర్వే నంబర్ 175లో 219 ఎకరాలు, మరో సర్వే నంబర్ 176లో 324 ఎకరాలు, పులుసుమామిడి గ్రామ సర్వే నంబర్ 180లో 228 ఎకరాలు, మరో సర్వే నంబర్ 181లో 110 ఎకరాలు, నారాయణపూర్ సర్వే నంబర్ 135లో 1,334 ఎకరాలు, పరిగి మండలం బిజ్వారం గ్రామ సర్వే నంబర్ 169/ఆలో 206 ఎకరాలు, తాండూరు మండలం అంతారం గ్రామ సర్వే నంబర్ 205లో 25ఎకరాలు, మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం కేశ్వాపూర్ గ్రామ సర్వే నంబర్ 105లో 803 ఎకరాల భూములు ఉన్నట్లు తెలిపారు. వీటికి కౌలు హక్కు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల రైతులు రూ.2 వేలు డిపాజిట్ చేసి వేలంలో పాల్గొన వచ్చని వారు తెలిపారు.


