
యువతి అదృశ్యం
పహాడీషరీఫ్: యువతి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ గురువారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లి శ్రీరామ కాలనీకి చెందిన యాదగిరి కుమార్తె రాధిక(24) స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఈ నెల 6న ఉదయం 8 గంటలకు పాఠశాలకు వెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్ స్విచ్చాఫ్ ఉండడంతో పాటు, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకి లభ్యం కాలేదు. దీంతో ఆమె తల్లి సుజాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వివరాలు తెలిసిన వారు పోలీస్స్టేషన్లో లేదా 87126 62367 నంబర్కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.
వివాహిత..
మణికొండ: వివాహిత అదృశ్యమైన సంఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. పోలీసుల సమాచారం మేర కు... సికింద్రాబాద్లోని సీతాఫల్మండీకి చెందిన శ్రీరామ్ యోగిబాబు, తన భార్య సుచరిత(21)తో కలిసి శనివారం మధ్యాహ్న ం ఫైనాన్షియల్ జిల్లాలో ఉన్న ప్రిస్టేజ్ స్కైటెక్లోని ఆమె కార్యాలయానికి వచ్చారు. అందులో ఆమె ఫ్లోర్ మేనేజర్గా పనిచేస్తుంది. తనకు లోపల పని ఉందంటూ భర్తను బయ ట ఉంచి లోనికి వెళ్లింది. ఎంత సేపు వేచి చూసినా ఆమె రాకపోవటంతో లోనికి వెళ్లి చూడగా ఆమె అక్కడ కనిపించలేదు. పరిసర ప్రాంతాలతో పాటు బంధుమిత్రుల ఇళ్లలో విచారించినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో భర్త నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశా డు. ఆమె మెరూన్ రంగు దుస్తులు ధరించిందని, చేతికి స్మార్ట్ వాచ్ ఉందని, ఆమె ఆచూకీ తెలిస్తే నార్సింగి పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. కేసు దర్యాప్తులో ఉంది.
జంట హత్యల కేసు దర్యాప్తునకు బృందం
మొత్తం ఏడు టీంల ఏర్పాటు
రాజేంద్రనగర్: జంట హత్యల కేసు ఛేదించేందుకు రాజేంద్రనగర్ పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. నిందితుల ఆనవాళ్లు లభించకపోవడంతో దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. హత్య కేసును ఛేదించేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు ఆది వారం మరో బృందాన్ని ఏర్పాటు చేశారు. వృద్ధ దంపతుల కుటుంబ సభ్యులను ఆదివారం మరోసారి ప్రశ్నించి వివరాలను సేకరించారు. ఆస్తి వివాదాలు, డబ్బు, నగలు తదితర వాటి పై కుటుంబ సభ్యుల నుంచి పలు ప్రశ్నలు అడిగి సమాచారం సేకరించారు. సీసీ టీవీ ఫుటేజీల్లో లభించిన ఆధారంగా నిందితుల చిత్రాలను కుటుంబ సభ్యులతో పాటు బంధువు, మిత్రులకు చూపించినా ఎలాంటి క్లూ లభించలేదు. దీంతో నిందితుల చిత్రాలను అన్ని పోలీస్స్టేషన్లకు పంపించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులు వాడిన రెండు ద్విచక్ర వాహనాలు నంబర్ ప్లేట్లు మార్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఒక వాహనం లభించినా ఎలాంటి క్లూ లభించలేదని సమాచారం. పోలీసులు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్లూ లభించలేదంటూనే... త్వరలో నిందితులను పట్టుకుంటామని వెల్లడిస్తున్నారు.