అవినీతి జలగలు! | - | Sakshi
Sakshi News home page

అవినీతి జలగలు!

May 29 2025 9:51 AM | Updated on May 29 2025 9:51 AM

అవినీతి జలగలు!

అవినీతి జలగలు!

రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, ఇరిగేషన్‌, విద్యుత్‌ శాఖల్లో తిష్ట

సాక్షి, రంగారెడ్డి జిల్లా: కార్యాలయాల ఆవరణలో అవినీతి రహిత సేవలంటూ తాటికాయంత పెద్ద అక్షరాలతో ప్రకటనలు.. లోపల అడుగు పెడితే గుప్పుమనే అవినీతి వాసనలు. ఇదీ.. అక్రమ వసూళ్లకు, అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన ప్రభుత్వ కార్యాలయాల్లోని పరిస్థితి. ఇందులో దొరికిన వారే దొంగలు.. దొరకని వారు దర్జాగా దండుకుంటున్నారు. జిల్లాలోని రెవెన్యూ సహా రిజిస్ట్రేషన్‌, ఇరిగేషన్‌, విద్యుత్‌ శాఖల్లో అవినీతి జలగలెన్నో తిష్టవేసి కూర్చున్నాయి. ఆయా శాఖలకు తీరని మచ్చను తెచ్చిపెడుతున్నాయి. అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఒకరి తర్వాత మరొకరు ఏసీబీ వలకు చిక్కుతున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన అక్రమార్కులను అరెస్టు చేసి జైలుకు పంపుతున్నా.. వైఖరిలో మాత్రం మార్పురాకపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

అదనపు కలెక్టర్‌ ఘటన మరువక ముందే..

14 గుంటల భూమికి పాసుపుస్తకం కోసం గుర్రంగూడకు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.8 లక్షలు డిమాండ్‌ చేసి, ఏసీబీ కేసులో జైలుకు వెళ్లిన అదనపు కలెక్టర్‌ ఎంవీ భూపాల్‌రెడ్డి, సీనియర్‌ అసిస్టెంట్‌ మదన్‌ మోహన్‌రెడ్డిల వ్యవహారాన్ని పూర్తిగా మరువక ముందే.. తాజాగా ఇబ్రహీంపట్నం తహసీల్దార్‌ ఆఫీసులో మరో తిమింగలం ఏసీబీ వలకు చిక్కడం చర్చనీయాంశంగా మారింది. ఏడు గుంటల భూమికి పాసు పుస్తకం జారీకి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ జి.కృష్ణ రూ.12 లక్షలు డిమాండ్‌ చేయడంతో ఆదిబట్లకు చెందిన ఓ బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో బుధవారం ఆయన్ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

రెవెన్యూలో మచ్చుకు కొన్ని..

ఐదేళ్ల క్రితం కేశంపేట తహసీల్దార్‌ లావణ్య, అప్పటి వీఆర్‌ఓ అనంతయ్య ఏసీబీకి పట్టుబడ్డారు. రెవెన్యూ రికార్డులో పేరు మార్పిడికి రూ.9 లక్షలు డిమాండ్‌ చేసి రూ.4 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకుంది. తనిఖీల్లో భాగంగా ఆమె ఇంటి నుంచి రూ.93 లక్షల నగదు, భారీగా బంగారు ఆభరణాలు పట్టుబడటం అప్పట్లో సంచలనం రేపింది. మూడేళ్ల క్రితం కందుకూరు మాజీ ఎంపీఓ సహా పంచాయతీ మాజీ కార్యదర్శి సైతం ఏసీబీ వలకు చిక్కారు. నిషేధిత జాబితాలో ఉన్న వివాదాస్పద 98 దరఖాస్తులు తన ప్రమేయం లేకుండా ఆమోదం పొందాయని పేర్కొంటూ అప్పటి కలెక్టర్‌ భారతి హోళీకేరీ ఆదిబట్ల ఠాణాలో ఫిర్యాదు చేయడంతో ఇద్దరు ఆపరేటర్లను అరెస్టు చేశారు.

విద్యుత్‌, ఇరిగేషన్‌లోనూ..

జిల్లా నీటిపారుదలశాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ బన్సీలాల్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ కె.కార్తీక్‌, ఎస్‌ఈ ఆఫీసులోని ఏడబ్ల్యూ సెక్షన్‌ ఏఈ హెచ్‌.నిఖేష్‌కుమార్‌, గండిపేట మండల సర్వేయర్‌ పి.గణేశ్‌ ఏడాది క్రితం ఏసీబీకి చిక్కారు. వీరు బఫర్‌జోన్లలో నిర్మాణాలకు ఎన్‌ఓసీ జారీ చేసే విషయంలో నెక్నంపూర్‌కు చెందిన బొమ్మ నరేందర్‌రెడ్డి నుంచి రూ.2.50 లక్షలు డిమాండ్‌ చేసి మే 31న ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఇదే కేసులో పట్టుబడిన ఓ ఏఈ ఆస్తులు ఏకంగా వంద కోట్లకుపైగా ఉన్నట్లు గుర్తించారు. విద్యుత్‌ శాఖలోనూ పెద్ద సంఖ్యలోనే పట్టుబడ్డారు. గోపన్‌పల్లిలోని ఓ బహుళ అంతస్తుల భవనానికి ట్రాన్స్‌ఫార్మర్‌ సహా సిటీమీటర్‌ జారీ కోసం కాంట్రాక్టర్‌ శివారెడ్డి నుంచి రూ.50 వేలు తీసుకుంటూ గచ్చిబౌలి డివిజన్‌ ఏడీఈ సతీశ్‌ ఇటీవల ఏసీబీకి చిక్కారు. అంతకు ముందు ఇదే డివిజన్‌లో పని చేసిన ఏడీఈ రాములు, కొండాపూర్‌ డీఈ వెంకటరమణ ఇదే కేసుల్లో పట్టుబడ్డారు. ఇక గొర్రెల పంపిణీ పథకం స్కాంతో సంబంధం ఉన్న జిల్లాకు చెందిన అప్పటి పశు సంవర్థకశాఖ అధికారి అంజలప్ప, అప్పటి భూగర్భ జలవనరులశాఖ అధికారి రఘుపతి రెడ్డిలను ఏసీబీ అరెస్టు చేసింది.

జిల్లాలో తరచూ వెలుగు చూస్తున్న ఘటనలు అడ్డంగా పట్టుబడి జైలుకు వెళ్తున్నా మారని తీరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement