
పత్తి రైతుపై విత్తన భారం
● ఐదేళ్లలో ప్యాకెట్పై రూ.200 పెంపు ● ఈ ఏడాది పెరిగిన రూ.37 ● జిల్లాలో 44వేల ఎకరాలకు పైగా సాగు ● జిల్లా రైతులపై ఏటా రూ.అర కోటి భారం
చందుర్తి(వేములవాడ): పత్తి రైతులకు విత్తనాలు భారంగా మారుతున్నాయి. ఏటా కేంద్ర ప్రభుత్వం పత్తి విత్తనాల ధరలు పెంచుతుండడం రైతులకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇదే సమయంలో పత్తి మద్దతు ధర గురించి పట్టించుకోవడం లేదు. విత్తన ధరలు పెంచిన ప్రభుత్వం మద్దతు ధర సైతం పెంచాలని రైతులు కోరుతున్నారు. మార్కెట్లో 450 గ్రాముల పత్తి ప్యాకెట్ రూ.864 ఉండగా.. ప్రస్తుతం ప్యాకెట్ ధరను రూ.901కి పెంచింది. ఎకరానికి మూడు ప్యాకెట్లు వినియోగిస్తే ఏటా అదనంగా రూ.111 భారంగా మారుతుంది. ఇలా జిల్లాలో 44 వేల సాగు అవుతుండడంతో రైతులపై ఏటా రూ.50లక్షలకు పైగానే ఆర్థిక భారం పడుతుంది.
గిట్టుబాటు ధర అంతంతే..
జిల్లాలోని 2.28 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతుండగా.. వరి 1.74లక్షల ఎకరాలు, పత్తి 44,650 ఎకరాలు, మిగతా మొక్కజొన్న, కందులు 7వేల ఎకరాల్లో సాగుచేస్తున్నారు. గత మూడేళ్లుగా అధిక వర్షాలు పడుతుండడంతో పత్తికి తెగుళ్లు ఆశిస్తున్నాయి. దీంతో రైతులు విచ్చలవిడిగా క్రిమిసంహారక మందులు వాడుతున్నారు. అధిక వర్షాలు పంటల దిగుబడిపై ప్రభావం చూపుతుండడం, తెగుళ్ల నివారణకు వాడే క్రిమిసంహారక మందులతో వ్యయం పెరిగిపోతుంది. ఒకప్పుడు ఎకరాకు 8 నుంచి 14 క్వింటాళ్ల వరకు దిగుబడి రాగా.. ప్రస్తుతం 6 నుంచి 7 క్వింటాళ్లకు పడిపోయింది. ప్రస్తుతం సీసీఐ గరిష్టంగా క్వింటాల్కు రూ.7,521 పెడుతుంది. నాణ్యత లేదనే సాకుతో రూ.7,421లకే కొనుగోలు చేసింది. బహిరంగ మార్కెట్లో మాత్రం రూ.6,300 నుంచి రూ.6,500 వరకే కొంటున్నారు.
పెరిగిన పెట్టుబడి వ్యయం
విత్తనాల ధరతోపాటు ఎరువులపై కేంద్రం ఇచ్చే సబ్సిడీని తగ్గించడంతో కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఏకంగా రూ.360 నుంచి రూ.700 వరకు పెరిగాయి. ఇదే సమయంలో పత్తి ధరను మాత్రం క్వింటాల్కు రూ.310 మాత్రమే పెంచింది. వ్యవసాయంలో యంత్రాల వినియోగం పెరగడంతో ఇంధన ఖర్చు సైతం పెరిగింది.
లూజ్ విత్తనాల వైపు రైతు చూపు
కేంద్ర ప్రభుత్వం పత్తి విత్తనాల ధరలను పెంచడంతో రైతులు లూజ్ పత్తి విత్తనాలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొందరు వ్యాపారులు లూజ్ పత్తి విత్తనాలను ఆంధ్ర ప్రాంతం నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్నారనే ప్రచారం ఉంది. ఈ విత్తనాలను కిలోకు రూ.550 నుంచి రూ.700 ధరకు విక్రయిస్తుండడంతో వీటిపైనే రైతులు దృష్టి సారిస్తున్నా రు. కంపెనీ విత్తనాలు అయితే ఎకరాకిని రూ.3,604 ఖర్చు అవుతుండడంతో రైతులు భారంగా భావిస్తూ లూజ్ విత్తనాలు కొంటున్నారు.
పత్తి విత్తన ప్యాకెట్ల ధరలు
2019 రూ.710
2020 రూ.730
2021 రూ.767
2022 రూ.810
2023 రూ.853
2024 రూ.864
2025 రూ.901
విత్తనాల
ధరలు తగ్గించాలి
రైతులకు సాగు ఖర్చు ఏటా పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలను తగ్గించడంతో ఎరువుల ధరలు పెరిగాయి. పత్తి విత్తనాల ధరలు పెరుగుతుండడంతో ఏటా భారం పెరుగుతోంది. ఎరువులు, విత్తనాలపై సబ్సిడీ పెంచడం సాధ్యం కాకపోతే కనీసం పంటలకై నా గిట్టుబాటు ధరలు పెంచి ఆదుకోవాలి.
– కటకం చంద్రయ్య, బండపల్లి

పత్తి రైతుపై విత్తన భారం