
నెరవేరుతున్న ప్ర‘జల’ ఆశలు
సిరిసిల్ల: మెట్టప్రాంత రైతుల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా మళ్లించి బీడు భూములను సస్యశ్యామలం చేస్తామనే పాలకుల ఐదు దశాబ్దాల హామీ కార్యరూపం దార్చుతోంది. ఈ ప్రాంత ప్ర‘జల’ ఆశలు నెరవేరుతున్నాయి. కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ కుడికాల్వ ద్వారా 12 గ్రా మాలకు సాగునీటిని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదివారం విడుదల చేయనున్నారు. ఈమేరకు నీటిపారుదలశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. కోనరావుపేట, వేములవాడ అర్బన్ మండలాల్లోని బీడు భూములను తొలిసారి గోదావరి జలాలు ముద్దాడనున్నాయి.
కాల్వలను శుభ్రం చేసి
కోనరావుపేట కనగర్తి–సుద్దాల గ్రామాల మధ్య కాల్వలో పేరుకుపోయిన మట్టిని నీటిపారుదల శాఖ అధికారులు ఇటీవల తొలగించారు. మల్కపేట రిజర్వాయర్ నీరు వేములవాడ అర్బన్ మండలం మారుపాక వెళ్లేలా పైపులైన్ పూర్తి చేశారు. మధ్యమానేరు నుంచి మల్కపేట వరకు 12.035 కిలోమీటర్ల సొరంగం పనులు పూర్తయ్యాయని, సొరంగంలో కాంక్రీట్ లైనింగ్ పనులు, సర్జిపూల్, పంప్హౌస్, డెలివరీ పైపులైన్ పూర్తి చేసి మల్కపేట రిజర్వాయర్లో ఒక్క టీఎంసీ నీటిని నింపినట్లు తెలిపారు. మల్కపేట నుంచి కెనాల్ ద్వారా మై సమ్మ చెరువు వరకు నీటిని విడుదల చేశామన్నారు.
కాళేశ్వరం–9 ప్యాకేజీలో ఎత్తిపోతలు
కాళేశ్వరం–9 ప్యాకేజీలో గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు వరకు గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు మూడు టీఎంసీల సామర్థ్యంతో మల్కపేట రిజర్వాయర్ నిర్మించారు. మల్కపేటకు మధ్యమానేరు నుంచి ఇప్పటికే నీరు వస్తుంది. ప్రస్తుతం మల్కపేట నుంచి కుడికాల్వ ద్వారా కోనరావుపేట మండలం మల్కపేట, కనగర్తి, నాగారం, పల్లిమక్త, సుద్దాల, రామన్నపేట, మంగళ్లపల్లి, వేములవాడ మండలం మారుపాక వరకు నీటిని విడుదల చేయనున్నారు. మల్కపేట కుడికాల్వ సామర్థ్యం 350 క్యూసెక్కులు కాగా.. 25,654 ఎకరాలకు సాగునీరు అందించనుంది.
ఎత్తిపోతలపై ‘సాక్షి’ ఎన్నో కథనాలు
జిల్లాను సస్యశ్యామం చేసే గోదావరి జలాల ఎత్తిపోతల పథకం పనులపై ‘సాక్షి’ అనేక సందర్భాల్లో గ్రౌండ్ రిపోర్టును అందించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–9 పనుల ప్రగతిపై ఎప్పటికప్పుడు కథనాలను ప్రచురించింది. 2013లోనే ఈ పథకానికి అప్పటి మంత్రులు సుదర్శన్రెడ్డి, శ్రీధర్బాబు రగుడు వద్ద శంకుస్థాపన చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సుజల స్రవంతి పథకంగా నామకరణం చేసి పనులు ప్రారంభించగా.. ఆ పేరును కాళేశ్వరం–9వ ప్యాకేజీగా మార్చి పనులు చేశారు. సొరంగం పనులు, రిజర్వాయర్ పనులు పూర్తయినా బ్యాలెన్స్ పనులను, ఆర్థిక శాఖ ద్వారా నిధులు విడుదల చేయించి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పూర్తి చేయించారు. దశాబ్దాల నాటి ఎత్తిపోతల పథకం కార్యరూపం దాల్చింది.
‘ఎత్తిపోతల’కు కార్యరూపం
‘మల్కపేట’ నుంచి నేడు నీటి విడుదల
విడుదల చేయనున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

నెరవేరుతున్న ప్ర‘జల’ ఆశలు

నెరవేరుతున్న ప్ర‘జల’ ఆశలు