
ఉపాధి అలవెన్స్ ఉత్తదేనా..
● అందని వేసవి భత్యం ● పని ప్రదేశంలో సౌకర్యాలు కరువు ● పెండింగ్లో కూలీలు, ఉద్యోగుల వేతనాలు ● సమ్మె చేస్తున్న ఉపాధిహామీ సిబ్బంది
ముస్తాబాద్/గంభీరావుపేట(సిరిసిల్ల): వలసల నివారణకు ప్రవేశపెట్టిన ఉపాధిహామీ పథకం క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలుకావడం లేదు. కూలీలకు సరైన పనిదినాలు కల్పించడం లేదు. ఎండలు మండుతున్నా వేసవి అలవెన్సుల గురించి పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది అలవెన్సును ఇప్పటికీ ప్రకటించకపోవడంతో కూలీలు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 98వేల ఉపాధిహామీ జాబ్కార్డులు ఉండగా.. 92వేల మంది కూలీలు పనిచేస్తున్నారు. ఇదే సమయంలో కూలీలు, ఉద్యోగులకు వేతనాలు కూడా అందడం లేదు. ఈ విషయమై ఉపాధిహామీ సిబ్బంది బుధవారం నుంచి సమ్మె చేస్తున్నారు.
వేసవిలో అలవెన్సు ఇలా..
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకంలో వేసవిలో పనిచేసే కూలీలకు ఏటా అలవెన్సును రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ వచ్చింది. ఫిబ్రవరిలో 20 శాతం, మార్చి, ఏప్రిల్లో 25 శాతం, మేలో 30 శాతం, జూన్లో 25 శాతం అలవెన్సు చెల్లించాల్సి ఉంది. ఎండలో నేల కఠినంగా ఉండడంతోపాటు తొందరగా కూలీలు అలసిపోయి ఎక్కువ పనిచేయలేరు. ఈనేపథ్యంలో కూలీలకు వేసవిలో అదనంగా భత్యం చెల్లిస్తారు. 2024–25లో జిల్లాలో కూలీలకు రూ.21.78కోట్లు మంజూరు చేశారు. 2025–26లో రూ.12.43 కోట్లు కేటాయించారు.
పెంచిన వేతనాలతో సరి..
వేసవిలో ప్రత్యేకంగా అలవెన్సును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనప్పటికీ ఉపాధిహామీలో పనిచేసే కూలీలకు గరిష్టంగా రూ.307 నిర్ణయించారు. కనిష్టంగా రూ.222.39 చెల్లిస్తున్నారు. గతంలో రూ.280 ఇవ్వగా, దానిని రూ.27కు పెంచారు. భత్యం చెల్లించకపోవడంతో, పెరిగిన వేతనాలతో కూలీలు సంతృప్తి పడాల్సి వస్తోంది.
98,133 జాబ్కార్డులు
జిల్లా వ్యాప్తంగా 98,133 జాబ్కార్డులు ఉండగా.. 1,99,721 మంది కూలీలు పనులు చేస్తున్నారు. పథకం అమలులో 34 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, 153 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 9 మంది ఏపీవోలు, ఐదుగురు ఈసీఎన్లు, 19 మంది సీవోఎస్లు పనిచేస్తున్నారు. మూడు నెలలుగా కూలీలకు, ఉద్యోగులకు, సిబ్బందికి వేతనాలు రావడం లేదు.
బయోమెట్రిక్ హాజరు
పని ప్రదేశంలోనే కూలీల హాజరును ఫీల్డ్అసిస్టెంట్లు నమోదు చేస్తారు. ఈసారి మాత్రం బయోమెట్రిక్ ద్వారా హాజరు వేస్తున్నారు. పనిలో చేరిన నిమిషంలోనే ముఖాన్ని ఫొటో తీసి యాప్లో అప్లోడ్ చేయడం, పనిముగిసే సమయంలో ఐరీష్ తీసుకుని అప్లోడ్ చేస్తున్నారు. ఉపాధి పనులు గుట్టలు, అడవిలో చేస్తుండడంతో అక్కడ నెట్వర్క్ సరిగా లేక బయోమెట్రిక్ హాజరుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కో రోజు నెట్వర్క్ పనిచేయక అప్లోడు కావడం లేదని ఫీల్డ్ అసిస్టెంట్లు పేర్కొంటున్నారు.
పనిప్రదేశంలో సౌకర్యాలు కరువు
వేసవి కావడంతో ఉపాధి పనులు జరిగే ప్రదేశంలో కూలీలకు నీడ సౌకర్యం కల్పించాల్సి ఉంది. ఓర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు, మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచాలి. కానీ ప్రస్తుతం పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ఎక్కడ కూడా అవి అందుబాటులో లేవు. ఎండ వేడిమికి తట్టుకోలేక కూలీలు చెట్ల నీడను ఆశ్రయిస్తున్నారు.