
హెల్మెట్.. నెగ్లెక్ట్
● ‘ఈ ఫొటోలోని మృతుడు ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన కర్రె మైసయ్య(49). బైక్పై వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలు దక్కేవని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు’.
● ఇతను ఆంధ్ర ప్రాంతానికి చెందిన మహేశ్బాబు. వయస్సు 18 ఏళ్లు. ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామ శివారులో ఆదివారం మధ్యాహ్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇతనితోపాటు మరో యువకుడు మధు(25) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కేవలం హెల్మెట్ లేని కారణంగానే ఇద్దరి తలలు పగిలి విగతజీవులుగా మారారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. వారిపై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి.
● హెల్మెట్పై వాహనదారుల అనాసక్తి ● జిల్లాలో నిత్యం రోడ్డు ప్రమాదాలు
● కరీంనగర్– కామారెడ్డి మార్గంలో డేంజర్ స్పాట్స్ ● టీనేజీలోనే నిండు నూరేళ్లు
● తల్లిదండ్రుల ఆశలు ఆవిరి ● 49 ప్రమాదాల్లో 11 మంది మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అతివేగం.. అజాగ్రత్త.. హెల్మెట్ ధరించకపోవడంతో జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలు నిలిచేవని చర్చ సాగుతోంది. ఎండాకాలం.. హెల్మెట్ ధరిస్తే చెమట వస్తుందనే భావనతో వాహనదారులు హెల్మెట్ను బండికి తగిలేసుకొని వెళ్తూ ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. జిల్లాలో రెండు నెలల్లో జరిగిన 49 రోడ్డు ప్రమాదాల్లో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 50 మందికి పైగా క్షతగాత్రులయ్యారు.
కరీంనగర్–కామారెడ్డి రోడ్డుపై డేంజర్ స్పాట్స్
● కరీంనగర్– కామారెడ్డి రోడ్డు జిల్లాలో బోయినపల్లి మండలం నర్సింగాపూర్ వద్ద మొదలై గంభీరావుపేట మండలం పెద్దమ్మస్టేజీ వరకు కొనసాగుతోంది. నర్సింగాపూర్ నుంచి పెద్దమ్మస్టేజీ వరకు దాదాపు 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ దూరంలో అనేక డేంజర్స్పాట్స్ ఉన్నాయి.
● బోయినపల్లి మండలం కొదురుపాక జంక్షన్ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లి, రుద్రవరం, నాంపల్లి, వేములవాడ నందికమాన్, అగ్రహారం స్టేజీల వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుండడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది.
● జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ చౌరస్తా వద్ద ఏ వాహనం ఎటు నుంచి వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి ఉంది.
● సిరిసిల్ల శివారులోని చంద్రంపేట స్టేజీ వద్ద డేంజర్ స్పాట్ ఉంది. ఇక్కడ తరచూ జరుగుతున్న ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండడం ఆందోళనకు గురిచేస్తుంది.
● సిరిసిల్ల శివారులోని పెద్దూరు, సర్దాపూర్, సిరిసిల్ల పట్టణంలోని గోపాల్నగర్చౌరస్తా వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
● ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ శివారులోని హనుమాన్ ఆలయం వద్ద, హరిదాస్నగర్ శివారులోని అర్బన్ఫారెస్ట్ పార్క్, పదిర నుంచి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం వరకు గల రోడ్డు ప్రమాదకరంగా మారింది. ఈ ప్రాంతంలో రోడ్డుపై వాహనాలు అతివేగంగా వస్తూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇటీవల జరిగిన రెండు ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు క్షతగాత్రులయ్యారు.
● ఎల్లారెడ్డిపేట మండలం సత్తెపీరీల దర్గా, గంభీరావుపేట మండలం నాగంపేట శివారులో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
జరిమానాలపైనే దృష్టి
జిల్లా వ్యాప్తంగా పోలీసులు తరచూ డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నారే తప్ప హెల్మెట్ ధరించని వారిని ఆపి అడగడం లేదని తెలుస్తోంది. అయితే వాహనదారుల ఫొటోలు తీస్తూ జరిమానాలు విధిస్తున్నారనే విమర్శలు మాత్రం ఉన్నాయి. హెల్మెట్ ధరించని వాహనదారుడిని పోలీసులు ఆపి, హెల్మెట్ ధరిస్తేనే బైక్ ఇస్తామని హెచ్చరిస్తే చాలా మంది ధరించే అవకాశం ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హెల్మెట్ ధరిస్తేనే క్షేమం
ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరిస్తేనే ఏ పరిస్థితుల్లోనైనా క్షేమంగా ఉంటారు. ప్రమాదాలు జరిగినా గాయాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పిస్తున్నాం. ఇకపై హెల్మెట్ ధరించకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా నిత్యం వాహన, డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు చేస్తున్నాం.
– శ్రీనివాస్గౌడ్, సీఐ, ఎల్లారెడ్డిపేట

హెల్మెట్.. నెగ్లెక్ట్

హెల్మెట్.. నెగ్లెక్ట్

హెల్మెట్.. నెగ్లెక్ట్

హెల్మెట్.. నెగ్లెక్ట్