
ఎండకు చేపలు విలవిల
● అధిక ఉష్ణోగ్రతలకు వేడెక్కుతున్న నీరు ● ఆవిరి అవుతున్న జలం ● చనిపోతున్న చేపలు ● జాగ్రత్తలతోనే రక్షించుకోవచ్చు ● జిల్లా మత్స్యశాఖ అధికారి
సిరిసిల్ల/బోయినపల్లి(చొప్పదండి): ఎండలు దంచి కొడుతున్నాయి. చెరువులు, కుంటల్లో నీరు వేడెక్కుతోంది. అధిక ఉష్ణోగ్రతలతో నీటిలో ప్రాణవాయువు కొరతతో చేపలు విలవిలలాడుతున్నాయి. నీటిలో నాణ్యత తగ్గడం.. ఒకే చోట ఎక్కువ చేపలు చేరడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో చెరువులు, కుంటల్లో నీరు తగ్గి చేపలు చనిపోతున్నాయి. అయితే జాగ్రత్తలతో చేపలను కాపాడుకోవచ్చని జిల్లా మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు.
మూడు ప్రాజెక్టులు, 329 చెరువులు
జిల్లాలోని 13 మండలాల్లో 329 వరకు చెరువులు, కుంటలు ఉన్నాయి. బోయినపల్లి మండలం మాన్వాడలో మిడ్మానేరు, గంభీరావుపేట మండలంలో ఎగువమానేరు, ఇల్లంతకుంట మండలంలో అన్నపూర్ణ ప్రాజెక్టులు ఉన్నాయి. సముద్రలింగాపూర్ చెరువు, గంభీరావుపేట పెద్దచెరువు, వేములవాడ, విలాసాగర్ లార్జ్ ట్యాంకులు ఉన్నాయి. గతేడాది జిల్లాలో 45.20 లక్షల చేపపిల్లలను వదిలారు. 329 చెరువుల్లో 30 లక్షలు, మిడ్మానేరులో 14.25లక్షలు, అన్నపూర్ణ ప్రాజెక్టులో 4,53,251 చేపపిల్లలు వదిలారు. గంభీరావుపేట ఎగువమానేరులో చేపపిల్లలు వదల లేదు.
8 వేల మంది మత్స్యకారులు
చేపల పెంపకం ద్వారా 8,642 మంది మత్స్యకార్మికులు ఉపాధి పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 135 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, పలు మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలతోపాటు ఎగువమానేరులో మత్స్యకార్మిక సొసైటీ ద్వారా అక్కడ మత్స్యకార్మికులు చేపల వేటతో జీవనోపాధి పొందుతున్నారు.
చేపల పెంపకం ఇలా..
ప్రాజెక్టులు : మిడ్మానేరు, ఎగువ మానేరు, అన్నపూర్ణ
చెరువులు, కుంటలు : 329
చేపపిల్లలు వదిలిన ప్రాజెక్టులు : మిడ్మానేరు, అన్నపూర్ణ
వదిలిన చేపపిల్లలు : 45.20 లక్షలు
మత్స్యకార్మికులు : 8,642
మత్స్యపారిశ్రామిక
సహకార సంఘాలు : 135

ఎండకు చేపలు విలవిల