
భూభారతితో సమస్యలు పరిష్కారం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడరూరల్: భూభారతి ద్వారా గతంలోని సమస్యలకు పరిష్కారమార్గం ఏర్పడుతుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్కుమార్ ఝా పేర్కొన్నారు. వేములవాడరూరల్ మండలం హన్మాజీపేటలో భూభారతి చట్టంపై బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. వారు మాట్లాడుతూ అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని ఇచ్చిన మాట ప్రకారం నేడు భూభారతి తీసుకొచ్చినట్లు తెలిపారు. గతంలో నేను ముమ్మాటికీ భారతీయుడిని అని ప్రగల్భాలు పలికిన వ్యక్తి కూడా న్యాయస్థానం ఎదుట తలవంచి రూ.30లక్షలు చెల్లించారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోసం కృషి చేసేదన్నారు. రూ.2లక్షలు రుణమాఫీ చేశామని, హన్మాజీపేట బ్రిడ్జి పూర్తి చేశామన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. తహసీల్దార్ అబుబాకర్, ఏవోలు సాయికిరణ్, వినీత, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, సెస్ డైరెక్టర్ దేవరాజం, నాయకులు సామ తిరుపతిరెడ్డి, చిలుక ప్రభాకర్, చెన్నాడి శ్యామల పాల్గొన్నారు.