
లారీలు రావు.. కాంటా పెట్టరు !
● సర్ధాపూర్ ఏఎంసీ గోదాం వద్ద అన్లోడింగ్ తిప్పలు ● ఇప్పటికే వడ్లతో నిండిపోయిన గోదాములు ● ధాన్యం కొనుగోళ్లకు కష్టకాలం
● మొగులు చూస్తే రైతు గుండెల్లో గుబులు
ధాన్యం సేకరణ ప్రణాళిక
వరి సాగు 1,78,350 ఎకరాలు
దిగుబడి అంచనా 3.67 లక్షల మెట్రిక్ టన్నులు
మద్దతు ధర (క్వింటాలుకు..) ‘ఏ’ గ్రేడ్కు: రూ.2,320, కామన్ రకానికి: రూ.2,300
కొనుగోలు కేంద్రాలు : 241
ఇప్పటి వరకు ప్రారంభించిక కేంద్రాలు 239
కొనుగోళ్లు ప్రారంభించిన కేంద్రాలు 179
కొనుగోలు చేసిన ధాన్యం 12,203.720 మెట్రిక్ టన్నులు
గోదాముకు చేరిన ధాన్యం 7,785.060 మెట్రిక్ టన్నులు
వడ్లను అమ్ముకున్న రైతులు 1,707
రెండు ఎకరాలు కోసిన
రెండెకరాల పొలం కోసి పది రోజులైంది. వడ్లు ఆరినయి. లారీలు రావడం లేదని రెండు రోజులుగా కాంటా పెడుతలేరు. మొగులు చూస్తే చెడగొట్టు వానలు పడుతాయని భయమవుతుంది. తొందరగా లారీలు పంపించి వడ్లను జోకాలి. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
– శివరాత్రి ఎల్లయ్య, గూడెం
వంద లారీలు ఆగిపోయాయి
సర్ధాపూర్ గోదాములో వందలారీలు అన్లోడింగ్ కోసం ఉన్నాయి. నాలుగు రోజులుగా లారీలు లోడింగ్తోనే ఉంటే టైర్లు దెబ్బతింటాయి. మాకు ఆర్థికంగా నష్టం వస్తుంది. హమాలీల సంఖ్య పెంచాలి. గోదాముల్లో జాగ లేదంటున్నారు.
– రఫిక్, లారీ యజమాని, సిరిసిల్ల
మిల్లర్లు ముందుకొస్తున్నారు
జిల్లాలో రైస్మిల్లర్లు ఒక్కొక్కరుగా బ్యాంకు గ్యారంటీ ఇస్తూ ముందుకొస్తున్నారు. బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన వారికి వడ్లను కేటాయిస్తాం. రా రైస్మిల్లులకు ఈ సీజన్ వడ్లు కేటాయించం. బాయిల్డ్ రైస్మిల్లులకే ఇస్తాం. సర్ధాపూర్ గోదాములో లారీలు అన్లోడింగ్ సమస్యను పౌరసరఫరాల జిల్లా మేనేజర్ పర్యవేక్షిస్తారు. రైతులకు ఇబ్బంది కాకుండా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తాం.
– పి.వసంతలక్ష్మి, డీఎస్వో
ఇది ముస్తాబాద్ మండలం గూడెం. రైతులు పది రోజుల క్రితం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చి ఆరబెట్టగా తేమశాతం వచ్చింది. దీంతో బస్తాల్లో నింపి తూకం వేశారు. కానీ వడ్లను తరలించేందుకు లారీలు రాకపోవడంతో తూకం నిలిపివేశారు. లారీలు వస్తేనే, తూకం వేసి బస్తాలు రవాణా చేస్తేనే కొత్తగా వరుస క్రమంలో తేమశాతం వచ్చిన వడ్లకుప్పలను తూకం వేస్తామని ఐకేపీ సెంటర్ల నిర్వాహకులు తేల్చి చెబుతున్నారు.
వడ్లు ఆరినయి
నాకు ఎకరం కంటే కొంచెం ఎక్కువ భూమి ఉంది. మరో ఎకరమంత కౌలుకు తీసుకుని వరి వేసిన. వరి కోసి వారం దాటింది. వడ్లు ఆరినయి. అయినా ఇంకా వడ్లను నేర్పుతూనే ఉన్నా. వడ్లు జోకినా లారీలు రాక ఎక్కడి బస్తాలు అక్కడే ఉన్నాయి. రైస్మిల్లులకు వడ్లు కేటాయించలేదట.
– పోచంపల్లి మల్లయ్య, పెద్దూరు
ఇవీ తంగళ్లపల్లి మండలంలో ఆరబోసిన వడ్లకుప్పలు. తేమశాతం రావడంతో అకాల వర్షాల భయంతో కొందరు రైతులు వడ్లకుప్పలపై టార్పాలిన్ కవర్లు కప్పగా.. మరికొందరు కవర్లు లేక అలాగే వదిలేశారు. ఒక్క వర్షం పడినా వడ్లు తడిసిపోతాయని రైతులు భయాందోళన చెందుతున్నారు. లారీలు రాక.. వడ్లు కాంటా పెట్టడం లేదు.
ఇదీ.. సిరిసిల్ల పట్టణ శివారులోని సర్ధాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో గోదాముల వద్ద వడ్ల లారీలు. ఒక్కటి.. రెండు.. కాదు.. ఏకంగా వందలారీలు ఇలా వడ్ల బస్తాల లోడ్లతో నాలుగు రోజులుగా ఉంటున్నాయి. హమాలీలు ఉన్నా సరిపోక అన్లోడింగ్ కోసం రోజుల తరబడి నిరీక్షిస్తున్నాయి. మరోవైపు గోదాములు సైతం వడ్లబస్తాలతో నిండిపోయాయి. ఇక్కడ ఇంకా వడ్లను నిల్వ చేసేందుకు స్థలం లేని పరిస్థితి.
సిరిసిల్ల: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు సవాలక్ష అడ్డంకులు ఎదురవుతున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి వారం, పది రోజులు గడుస్తోంది. చాలా మటుకు తేమశాతం కూడా వచ్చింది. అయితే తూకం వేసిన ధాన్యాన్ని లారీల్లో గోదాముల వద్దకు పంపిస్తే రోజులకొద్దీ అన్లోడింగ్ కావడం లేదు. ఫలితంగా లారీలు ఖాళీ కాకపోవడంతో కేంద్రాల్లోని ధాన్యం కుప్పలుగా పేరుకుపోతుంది. జిల్లా శివారులోని సర్ధాపూర్ ఏఎంసీ గోదాములు నిండిపోయి వంద లారీలు నిలిచిపోయాయి. జిల్లాలో 36 బాయిల్డ్ రైస్మిల్లులు ఉండగా... నలుగురు మాత్రమే ధాన్యం దింపుకునేందుకు బ్యాంకు గ్యారంటీ ఇచ్చారు. మిగతా 32 రైస్మిల్లులు బ్యాంకు గ్యారంటీ ఇవ్వలేదు. రా రైస్మిల్లులు సీఎమ్మార్ బియ్యం పూర్తిస్థాయిలో ఇవ్వకపోవడంతో వడ్లను కేటాయించలేదు. దీంతో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు అస్తవ్యస్థంగా మారింది. మరోవైపు అకాల వర్షాలు రైతులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

లారీలు రావు.. కాంటా పెట్టరు !

లారీలు రావు.. కాంటా పెట్టరు !

లారీలు రావు.. కాంటా పెట్టరు !

లారీలు రావు.. కాంటా పెట్టరు !

లారీలు రావు.. కాంటా పెట్టరు !

లారీలు రావు.. కాంటా పెట్టరు !