ప్రకృతి ప్రకోపం..
● వడగండ్లవానకు మద్దికుంట విలవిల ● 350 ఎకరాల్లో తుడిచిపెట్టుకుపోయిన వరి ● 34 ఎకరాల్లో మామిడితోటలు ● ప్రభుత్వమే ఆదుకోవాలని రైతుల వేడుకోలు
ఇతను ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన రైతు ఎలుసాని దేవయ్య. మద్దికుంట శివారులో ఉన్న 4.20 ఎకరాలలో వరి సాగుచేస్తున్నాడు. మరో వారం రోజులైతే హర్వెస్టర్తో పంట కోద్దామనుకోగా శుక్రవారం సాయంత్రం భారీ వడగండ్ల వానతో వరిపంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క గింజ మిగలకుండా పంటంతా నేలపాలైంది. ఎకరానికి రూ.25వేలు పెట్టుబడి పెట్టిన దేవయ్యకు.. చేసిన శ్రమ మట్టిపాలు కాగా, పెట్టుబడులు మీదపడ్డాయి. ఆ పంట చేతికొస్తే ఎకరాకు రూ.50వేల వరకు ఆదాయం వచ్చేది. రాలిన ధాన్యం వద్ద దేవయ్య కన్నీరుపెడుతున్నాడు.
ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రకృతి ప్రకోపానికి రైతులు విలవిలలాడుతున్నారు. కళ్ల ఎదుటే నోటికాడి ముద్ద మట్టిలో కలిసిపోతుంటే చూస్తూ కన్నీరుపెడుతున్నారు. ధాన్యం నేలరాలిపోగా, మామిడిచెట్లు విరిగిపోయాయి. ముస్తాబాద్ మండలం మద్దికుంట, ముస్తాబాద్ గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానకు 360 ఎకరాల్లో వరిపంట దెబ్బతింది, ఒక్క మద్దికుంటలోనే 120 మంది రైతులకు చెందిన 350 ఎకరాల్లో వరిపంట దాదాపు వందశాతం దెబ్బతింది. అలాగే 34 ఎకరాల్లోని మామిడితోటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు వ్యవసాయ, ఉద్యానవనశాఖ అధికారులు సర్వే చేపట్టారు. బాధిత రైతుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మద్దికుంట, ముస్తాబాద్, మొర్రాయిపల్లి గ్రామాల్లో ఈదురుగాలులకు 12 షెడ్లు లేచిపోయాయి.
పంటల బీమాపై అవగాహన కరువు
వ్యవసాయంపై ఎలాంటి బీమా లేదు. నష్టం జరిగితే పరిహారం మాట ఉండదు. ప్రభుత్వాలు మారినా పంటల బీమాపై భరోసాను పాలకులు ఇవ్వలేకపోతున్నారు. దీనిపై నిర్ధిష్టమైన విధానమంటూ లేకపోవడం, అన్నదాతలకు శాపంగా మారింది. ఒక్క మద్దికుంట గ్రామంలోనే 350 ఎకరాలకు పైగా వరిపంట, మునగ, మామిడితోటలు ధ్వంసమయ్యాయి. ప్రతీ ఐదుగురు రైతుల్లో ముగ్గురు బాధితులే ఉన్నారు. ఏ ఇంటా చూసిన వడగండ్ల నష్టం తాలుకు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఫసల్బీమా అమలు చేసిన పరిహారం వచ్చేదని రైతులు పేర్కొంటున్నారు. ఎకరానికి రూ.25వేలు పెట్టుబడి అవుతుండగా, ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం ఇచ్చే రూ.10వేలపై విమర్శలు ఉన్నాయి. కనీసం పెట్టుబడి డబ్బులు కూడా ఇవ్వడం లేదంటున్నారు. పంటల బీమాపై వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించి, గ్రామాన్ని యూనిట్గా తీసుకుని నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు.
మామిడి తోట ధ్వంసమైంది
మద్దికుంట శివారులో ఆరు ఎకరాల్లో మామిడితోట ఉంది. మరో రెండున్నర ఎకరాలు వరిపంట వేశాను. మామిడి ఈసారి మంచి కాతకు వచ్చింది. పంట బాగా పండింది. అంతా బాగుందని మురిసిపోతుండగా వచ్చిన రాళ్లవాన మమ్ముల్ని ఆగం చేసింది. మామిడికాయలు మొత్తం రాలిపోయాయి. పది మామిడి చెట్లు కూలిపోయాయి. రేకులషెడ్డు లేచిపోయింది. వరిపంట దెబ్బతింది. ప్రభుత్వం ఆదుకోవాలి. – రాజు, మద్దికుంట
అన్నదాత విలాపం
అన్నదాత విలాపం
అన్నదాత విలాపం
అన్నదాత విలాపం