శిఖం భూమి.. పరిహారం రాదేమి | - | Sakshi
Sakshi News home page

శిఖం భూమి.. పరిహారం రాదేమి

Apr 21 2025 12:57 AM | Updated on Apr 21 2025 12:57 AM

శిఖం

శిఖం భూమి.. పరిహారం రాదేమి

● వెంకట్రాయిని చెరువులో మునిగిన 170 ఎకరాలు ● ఉపాధి కోల్పోయిన 150 కుటుంబాలు ● ఆదుకోని పాలకుల హామీలు ● పనులు లేక వలసపోతున్న పలువురు

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి

వేములవాడఅర్బన్‌: అంగన్‌వాడీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని అంగన్‌వాడీ టీచర్ల రాష్ట్ర ప్రధానకార్యదర్శి కరుణకుమారి కోరారు. స్థానిక గుమ్మిపుల్లయ్య భవన్‌లో ఆదివారం అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఐసీడీఎస్‌ ద్వారా 50 ఏళ్లుగా సేవలందిస్తున్న తాము చాలీ చాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ టీచర్లకు రూ.2లక్షలు, ఆయాలకు రూ.లక్ష ఇవ్వాలని కోరారు.

వీర్నపల్లి(సిరిసిల్ల): భూమి ఉంటే భరోసా.. మనోధైర్యం.. ఉన్న కొద్దిపాటి భూమిలో పంట పండించుకొని బతుకు వెల్లదీసేవారు పల్లెల్లో చాలా మంది కనిపిస్తుంటారు. ఆ భూమి నీళ్లలో మునిగిపోతే రైతులకు భరోసా పోతుంది. శిఖం భూములైతే వర్షాకాలంలో చెరువునీటితో మునిగిపోయినా వేసవిలో తేలి పంటలు సాగుచేసుకునే అవకాశం ఉంటోంది. కానీ వీర్నపల్లిలోని వెంకట్రాయిని చెరువు శిఖం భూములు తేలడం లేదు. ఐదేళ్ల క్రితం చెరువును మరమ్మతు చేయడంతో నీటి లీకేజీలు ఆగిపోయి నీటిమట్టం తగ్గడం లేదు. దీంతో పలువురు రైతులు తమ భూములు మునిగిపోయాయని, పరిహారం ఇప్పించాలని వారి విన్నపాలు బుట్టదాఖలవుతున్నాయి. ఉపాధి కోసం కూలీలుగా మారుతున్నారు.

170 ఎకరాల శిఖం

వీర్నపల్లి మండల కేంద్రంలోని వెంకట్రాయినిచెరువులో సుమారు 170 ఎకరాల శిఖం భూములు ఉంటాయి. దాదాపు 150 మంది దళితులు ఆ భూములను సాగు చేసేవారు. వానాకాలంలో చెరువు నిండిపోయి బుంగలు పడి, తూము లీకేజీతో రెండు నెలల్లోనే ఖాళీ అయ్యేది. ఆ సమయంలో తేలిన భూముల్లో రైతులు వ్యవసాయం చేసుకునేవారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత మిషన్‌ కాకతీయలో భాగంగా రూ.49 లక్షలతో చెరువు కట్టకు మరమ్మతు చేసి బుంగలు పూడ్చారు. అయినా నీరు నిలవకపోవడంతో మళ్లీ రూ.50లక్షలతో కొత్తగా తూము నిర్మించారు. ఆరేళ్లుగా చెరువుకు లీకేజీల బెడద తప్పింది. ఫలితంగా చెరువు నిండా నీరు కనిపిస్తోంది. కాగా, ఐదేళ్లుగా శిఖం భూములు తేలక రైతులు ఏడాదికో పంట కూడా సాగుచేసుకోలేక పోయారు.

అధికారులు, పాలకుల చుట్టూ ప్రదక్షిణలు

వెంకట్రయినిచెరువు 110 ఎకరాల్లో విస్తరించి ఉంది. అందులో 49.29 ఎకరాలు కంచర్ల శివారు, 66 ఎకరాలు వీర్నపల్లి శివారులో ఉంది. చెరువు శిఖం ముంపు భూభాగంలో పట్టా భూములు కూడా ఉన్నాయి. ఈ భూములన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుపేద రైతులవే. ఎత్తిపోతల పథకంలో భాగంగా రూ.166కోట్లతో పనులు చేపట్టి చెరువును నింపాలని ప్రణాళికలు చేశారు. గత ప్రభుత్వ హయాంలోనూ పాలకులు, అధికారుల చుట్టూ రైతులు తిరిగారు. ఎత్తిపోతల పథకంలో చెరువును నింపి పరిహారం అందిస్తామన్న హామీతో వివాదం సద్దుమణిగింది. తర్వాత బాధితులను పట్టించుకునే వారు లేరు. చెరువు తూమును ధ్వంసం చేసిన ఘటనలో రైతులపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో 150 రైతు కుటుంబాలు ఉపాధి కోల్పోయి వీధినపడ్డాయి. వారిలో కొందరు గల్ఫ్‌బాట పట్టారు. మరికొందరు దినసరి కులీలుగా మారారు.

ప్రభుత్వం ఆదుకోవాలి

మా తాత ముత్తాతల నుంచి ఏక్‌ పసలు పంట పండించుకుంటున్నాం. మేము కూడా ఆరేళ్ల వరకు వరి పండించాం. సెప్టెంబర్‌లో తూము తీసి కంచర్లలోని పోతారా యిని చెరువులోకి నీళ్లు తీసుకెళ్లారు. ఆరేళ్లుగా చెరువులో నీరు తీయడం లేదు. నష్టపరిహారం ఇవ్వాలని డీఆర్వోకు, ఆర్డీవోకు, కలెక్టర్‌, మా జీ మంత్రి కేటీఆర్‌, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌కు వినతిపత్రాలు ఇచ్చాం. ఈ ప్రభుత్వమైనా ఆదుకోవాలి.

– గద్దరాశి భగవంతం, రైతు, వీర్నపల్లి

గల్ఫ్‌ బాట పట్టాడు

వెంకటరాయిని చెరువులో రెండెకరాల భూమి పోయింది. ఇక్కడ పని దొరక్క మా కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. నా భర్త తిరుపతి ఏడాది క్రితం దుబాయి వెళ్లాడు. భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలి. రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి.

– చింతనపల్లి మంగ, వీర్నపల్లి

శిఖం భూమి.. పరిహారం రాదేమి1
1/4

శిఖం భూమి.. పరిహారం రాదేమి

శిఖం భూమి.. పరిహారం రాదేమి2
2/4

శిఖం భూమి.. పరిహారం రాదేమి

శిఖం భూమి.. పరిహారం రాదేమి3
3/4

శిఖం భూమి.. పరిహారం రాదేమి

శిఖం భూమి.. పరిహారం రాదేమి4
4/4

శిఖం భూమి.. పరిహారం రాదేమి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement