అన్నపూర్ణ అడుగంటుతోంది.. | - | Sakshi
Sakshi News home page

అన్నపూర్ణ అడుగంటుతోంది..

Apr 20 2025 1:49 AM | Updated on Apr 20 2025 1:49 AM

అన్నప

అన్నపూర్ణ అడుగంటుతోంది..

● తగ్గుతున్న నీటిమట్టం ● ఎండిన బిక్కవాగు పరివాహకం ● బోరుబావుల్లో అడుగంటిన భూగర్భ జలాలు

ఇల్లంతకుంట(మానకొండూర్‌):

ఇల్లంతకుంట మండల వరప్రదాయిని అనంతగిరి(అన్నపూర్ణ) ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గుతోంది. ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గిపోతుండడంతో ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల్లోని వ్యవసాయబావులు, బోరుబావుల్లో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. బిక్కవాగులో ఇసుక తేలింది.

సగానికి పైగా పడిపోయిన నీటిమట్టం

అనంతగిరిలోని అన్నపూర్ణ ప్రాజెక్టులో నీటి కెపాసిటీ 3.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 1.24 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఈ ప్రాజెక్టు కింద 30వేల ఎకరాల ఆయకట్టు ఉంది. మిడ్‌ మానేరు ప్రాజెక్టు ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు పదో ప్యాకేజీలో భాగంగా నిర్మించిన సొరంగమార్గం నుంచి అనంతగిరి అన్నపూర్ణ జలాశయం వద్ద ఉన్న సర్జికల్‌పూల్‌లోకి నీరు చేరుతుంది. అక్కడి నుంచి మోటార్ల ద్వారా పంపింగ్‌ చేస్తూ అన్నపూర్ణ జలాశయంలోకి నీరు వెళ్తోంది. మిడ్‌మానేరులో 13 టీఎంసీల నీటి లభ్యత ఉంటేనే సొరంగమార్గం ద్వారా సర్జికల్‌పూల్‌లోకి నీరు వస్తోంది. ప్రస్తుతం మిడ్‌మానేరులో ఏడు టీఎంసీల నీరు మాత్రమే ఉండడంతో నీటిపంపింగ్‌ నిలిచిపోయింది. దీంతో అన్నపూర్ణ జలాశయంలో నీటినిల్వలు తగ్గిపోయాయి. ఈ ప్రాజెక్టు నుంచి సిద్దిపేటలోని రంగనాయకసాగర్‌ ప్రాజెక్టులోకి నీరు వెళ్తోంది. అక్కడి నుంచి మల్లన్నసాగర్‌కు వెళ్తోంది. ప్రాజెక్టు నిర్మాణంలో అనంతగిరి కొసగుట్టపల్లి పూర్తిగా మునిగిపోయాయి. మార్చి 2020లో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి ఆచరణలోకి వచ్చింది. ప్రాజెక్టు ప్రధాన కాలువకు ఎడమ, కుడి, రెండు కాలువలు ఉన్నాయి. ఎడమకాలువ కింద 5 డిస్ట్రిబ్యూటరీ కాల్వలు ఉండగా.. కుడికాలువ కింద రెండు డిస్ట్రిబ్యూటరీ కాల్వలు ఉన్నవి. ప్రాజెక్టు కింద ఉన్న ఎడమకాల్వ ద్వారా ఇల్లంతకుంట మండలంలో 15వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, కుడికాల్వ ద్వారా బెజ్జంకి మండలానికి 14వేల ఎకరాలకు సాగునీరు అందుతోందని, గన్నేరువరం మండలానికి 800 ఎకరాలకు నీరు అందుతోందని అనంతగిరి అన్నపూర్ణ ప్రాజెక్టు డీఈ దేవేందర్‌ తెలిపారు. అన్నపూర్ణ ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటి సామర్థ్యం ఉన్నప్పుడు సర్ఫేస్‌ గేట్లు ఎత్తడంతో అనంతారం ప్రాజెక్టులోకి నీరు త్వరగా చేరి అనంతరం ప్రాజెక్టు నిండుతుంది. మండల ప్రధాన బిక్కవాగు ప్రవహించి పరివాహక రైతుల వ్యవసాయబావుల్లో నీరు సమృద్ధిగా ఉండి పంటలు పండుతాయి. అనంతారం ప్రాజెక్టు మత్తడి నెల రోజుల క్రితమే ఆగిపోవడంతో బిక్కవాగు ఎండిపోయింది. పరివాహక ప్రాంతాలైన అనంతారం, రహీంఖాన్‌పేట, వంతడ్పుల, ఇల్లంతకుంట, నర్సక్కపేట, జవారిపేట గ్రామాల బోరుబావుల్లో నీటిమట్టాలు తగ్గిపోయాయి. మిడ్‌మానేరు ప్రాజెక్టులో నీటి లభ్యత 13 టీఎంసీల కంటే తక్కువగా ఉన్నందున అనంతగిరి అన్నపూర్ణ ప్రాజెక్టులోకి నీరు వచ్చే అవకాశం ప్రస్తుతం లేదని ప్రాజెక్టు డీఈ దేవేందర్‌ తెలిపారు.

మెయిన్‌ డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ పూర్తి కావాలసి ఉంది

అన్నపూర్ణ ప్రాజెక్టు ఎండీసీ(మెయిన్‌ డిస్ట్రిబ్యూటర్‌ కెనాల్‌)–2 పెండింగ్‌లో ఉంది. ఇది పూర్తి కావడానికి 50 ఎకరాల వరకు భూసేకరణ అవసరం ఉంది. అదేవిధంగా ప్రాజెక్టు పరిధిలో మైనర్‌ కెనాల్స్‌ నిర్మాణానికి 250 ఎకరాల భూసేకరణ అవసరం ఉంది. మైనర్‌ కాలువలు పూర్తయితే ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల పొలాలకు కాలువల ద్వారా డైరెక్ట్‌ గా నీరు అందుతుంది.

– ప్రాజెక్టు డి ఈ దేవేందర్‌

గొలుసు కట్టు చెరువులు నింపాలి

అన్నపూర్ణ ప్రాజెక్టు ద్వారా గొలుసు కట్టు పద్ధతిలో మండలంలోని చెరువులను నింపాలి. చెరువులు నిండితే వ్యవసాయ బోరుబావులలో ఊట పెరుగుతుంది. పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉండదు. దీనికోసం అధికారులు, ప్రజాప్రతినిధులు, చర్యలు తీసుకోవాలి.

– గన్నేరం నర్సయ్య, పెద్దలింగాపురం

అన్నపూర్ణ ప్రాజెక్టు వివరాలు

సామర్థ్యం : 3.5 టీఎంసీలు

ఆయకట్టు : 30 వేల ఎకరాలు

ప్రస్తుత నీటి లభ్యత : 1.24 టీఎంసీలు

అన్నపూర్ణ అడుగంటుతోంది..1
1/3

అన్నపూర్ణ అడుగంటుతోంది..

అన్నపూర్ణ అడుగంటుతోంది..2
2/3

అన్నపూర్ణ అడుగంటుతోంది..

అన్నపూర్ణ అడుగంటుతోంది..3
3/3

అన్నపూర్ణ అడుగంటుతోంది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement