
కాంట పెడ్తలేరు
● కేంద్రాల ప్రారంభానికే పరిమితం ● ఖరారు కాని రైస్మిల్లులు ● వారం రోజులుగా ధాన్యం ఆరబోస్తున్న రైతులు ● కేంద్రాల వద్ద పేరుకుపోతున్న వైనం ● పట్టించుకోని అధికారులు
‘ఇతను ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటకు చెందిన రైతు గోగూరి చంద్రారెడ్డి. వారం క్రితం వరి పంటను కోసి గ్రామంలో ఐదు రోజుల క్రితం ప్రారంభించిన కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. అయితే మాయిశ్చర్ వచ్చినా ధాన్యం తూకం ప్రారంభంకాకపోవడంతో ఎండల్లోనూ కుప్ప వద్దే కాపలా ఉంటున్నాడు. ఎప్పుడు తూకం వేస్తారో తెలియక అయోమయానికి గురవుతున్నాడు’.
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల):
జిల్లాలో వారంరోజుల క్రితం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన అధికారులు, నాయకులు ధాన్యం తూకం గురించి పట్టించుకోవడం లేదు. వాతావరణంలో మారుతున్న పరిస్థితులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రాల్లో ధాన్యం రాసులు పేరుకుపోయాయి. తేమ శాతం రావడానికి నిత్యం ఉదయమే కుప్పలుగా ఉన్న ధాన్యాన్ని ఆరబోసి, సాయంత్రం మళ్లీ కుప్పలుగా చేస్తున్నారు. తేమ శాతం వచ్చినా తూకం మొదలుకాకపోవడంతో కుప్పల వద్దే కాపలా ఉండాల్సి వస్తోంది. మరికొందరు రైతులు కేంద్రాలకు ధాన్యం తేకుండానే తక్కువ ధరకు రైస్మిల్లర్లు, ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు.
రోడ్లపైనే కుప్పలు
జిల్లాలోని చాలా మండలాల్లో కొనుగోలు కేంద్రాలకు సరిపోయేలా ప్రత్యేక స్థలాలు లేకపోవడంతో పలువురు రైతులు తమ ధాన్యాన్ని రోడ్లపైనే ఆరబోస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ శివారులో సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారిపైనే ధాన్యం ఆరబోస్తున్నారు. రోడ్డుపైనే ధాన్యం కుప్పలు ఉండడంతో వాహనదారులు రాత్రి వేళ ఇబ్బందులు పడుతున్నారు. గతంలోనూ ఇదే గ్రామంలో వడ్లకుప్పలు కారణంగా ఓ ద్విచక్రవాహనదారుడు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. రోడ్లపైన ధాన్యం కుప్పలు పోయొద్దని, ఒకవేళ పోస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. కానీ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలకు స్థలాలు లేక రైతులు రోడ్లపైనే ధాన్యం ఆరబోస్తున్నారు.
ఖరారుకాని మిల్లులు
జిల్లా వ్యాప్తంగా ఏ కొనుగోలు కేంద్రానికి కూడా రైస్మిల్లులు ఖరారు కాలేదు. ప్రభుత్వం కొత్తగా నగదు డిపాజిట్ చేయాలనే నిబంధన పెట్టడంతో మిల్లర్లు ముందుకురావడం లేదని తెలిసింది. దీంతో ధాన్యం తూకం వేస్తే ఏ మిల్లుకు తరలించాలో తెలియక అధికారులు, నిర్వాహకులు తల పట్టుకుంటున్నారు.
240 కేంద్రాలు
జిల్లా వ్యాప్తంగా 255 గ్రామాలు ఉండగా.. ఐకేపీ, మెప్మా, మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో 240 కేంద్రాలు ప్రారంభించాల్సి ఉంది. ఇప్పటి వరకు 148 కేంద్రాలు ప్రారంభించారు. ఇంకా 92 కేంద్రాలను ప్రారంభించాల్సి ఉంది. ఒక వైపు పూర్తిస్థాయిలో కేంద్రాలు ప్రారంభంకాకపోవడం, ప్రారంభించిన కేంద్రాల్లో ధాన్యం తూకం మొదలుకాకపోవడంతోఅన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో మొత్తం కేంద్రాలు 240
ప్రారంభించిన కేంద్రాలు 148
ప్రారంభం కావాల్సినవి 92

కాంట పెడ్తలేరు