జిల్లాలో 45 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
● జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాల కృష్ణ
ఒంగోలు సబర్బన్: జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన ధాన్యం ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాల కృష్ణ చెప్పారు. ఈ మేరకు ఆయన మంగళవారం ప్రకాశం భవనంలోని తన చాంబర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లాలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా ధాన్యం సేకరణ తీరు, సాధిస్తున్న పురోగతిని వివరించారు. జిల్లాలో 27 మండలాల్లో 201 రైతు సేవా కేంద్రాల పరిధిలో 45 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఖరీఫ్ 2025–26 సీజన్లో ఈనెల 16వ తేదీ వరకు 212 మంది రైతుల నుంచి రూ.3.99 కోట్ల విలువైన 1779.6 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు రూ.3.98 కోట్లను 211 మంది రైతులకు చెల్లించినట్లు చెప్పారు. మిగిలిన డబ్బులను తదుపరి బ్యాంకు బ్యాచ్ ప్రాసెస్లో జమచేస్తారన్నారు. జిల్లాలో లేట్ ఖరీఫ్, ఎర్లీ రబీ సాగును దృష్టిలో పెట్టుకుని రైతుల వద్ద నుంచి ప్రతి గింజ కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టామన్నారు. ధాన్యాన్ని విక్రయించడంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబరు 8008901457 ను సంప్రదించవచ్చని చెప్పారు. అదేవిధంగా వాట్సాప్ 7337359375 లోనూ సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ వరలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


