
మర్రిపూడిలో రెవెన్యూ రికార్డుల తనిఖీ
మర్రిపూడి: స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రెవిన్యూ రికార్డులను కనిగిరి ఆర్డీఓ జి.కేశవర్థన్రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. మండలంలోని గుండ్లసముద్రంలో సర్వే నంబర్ 571లో ఉన్న 207.86 ఎకరాల పశువుల బీడులో నిబంధనలకు విరుద్ధంగా కొంత భూమిని అధికారపార్టీ నాయకులు ఆన్లైన్ చేయించుకున్నారు. దీనిపై ఈ నెల17న ‘పశువుల బీడు ఫలహారం’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైంది. అలాగే మండల కేంద్రమైన మర్రిపూడిలో లక్ష్మీనృసింహస్వామి కొండ సమీపంలో సర్వే నంబరు 990–1లో 327.27 ఎకరాల భూమి ఉంది. దీనిలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని అప్పటి జిల్లా కలెకర్ట్ బ్లాక్లిస్టులో పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ నెల 25వ తేదీ ఆదివారం రోజున తహసీల్దార్ జ్వాలా నరసింహారావు తమ సిబ్బందితో కలిసి సర్వే నంబర్ 990–1లో కొంత భూమిని టీడీపీ సానుభూతిపరులకు ఆన్లైన్ చేయడంతో అసలైన భూ హక్కుదారులు కార్యాలయానికి వచ్చి గగ్గోలుపెట్టారు. ఈ విషయంపై ఈ నెల 26న ‘పచ్చనేతల తెగింపు.. తహసీల్దార్ బరితెగింపు’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. వీటిపై స్పందించిన కలెక్టర్ తమీమ్అన్సారియా విచారణకు ఆదేశించడంతో ఆర్డీఓ బుధవారం రెవెన్యూ రికార్డులు పరిశీలించారు. గుండ్లసముద్రం, మర్రిపూడి భూరికార్డుల తనిఖీ నివేదినకను కలెక్టర్కు అందజేస్తామని తెలిపారు.

మర్రిపూడిలో రెవెన్యూ రికార్డుల తనిఖీ