
సత్వర న్యాయంతోనే ప్రజల నుంచి ఆదరణ
● హైకోర్టు జడ్జి డాక్టర్ కె.మన్మథరావు
ఒంగోలు: సత్వర న్యాయంతోనే ప్రజల నుంచి మంచి ఆదరణ పొందగలుగుతామని హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ కె.మన్మథరావు అన్నారు. ఒంగోలులోని జిల్లా న్యాయస్థానం ఆవరణలో ఆదివారం రాత్రి నిర్వహించిన ఒంగోలు బార్ అసోసియేషన్ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేసుల పరిష్కారంలో ఇటు న్యాయమూర్తులు, అటు న్యాయవాదుల మధ్య మంచి వాతావరణం ఉండటం ద్వారానే సత్వర న్యాయం సాధ్యపడుతుందన్నారు. పాజిటివ్ దృక్పథంతో అందరికీ న్యాయవ్యవస్థ అందుబాటులో ఉందన్న భావన కలిగించాలంటే బార్ అండ్ బెంచ్ సంబఽంధాలే ముఖ్యమన్నారు. ప్రజలకు ఏం అవసరమో.. అదే అందించాలన్న ఆకాంక్షను ప్రతిఒక్కరూ కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తాను ఒంగోలు బార్ అసోసియేషన్ సభ్యుడిగానే న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించానని, 33 ఏళ్లపాటు న్యాయవాదిగా కొనసాగి గత 3 సంవత్సరాలుగా హైకోర్టు జడ్జిగా సేవలందిస్తున్నానని అన్నారు. అనేక కేసులను సత్వరమే పరిష్కరించే అవకాశం తనకు రావడాన్ని గొప్పగా భావిస్తున్నానని తెలిపారు. రోజుకు 30 నుంచి 40 ఉత్తర్వులను ఆంగ్లంలో ఇవ్వగలుగుతున్న తాను.. ఒక తెలుగులో తీర్పు ఇవ్వడానికి 42 రోజులు కృషిచేయాల్సి వచ్చిందన్నారు. అయినప్పటికీ తెలుగులో తీర్పు ఇవ్వాలన్న ఆకాంక్షను కూడా తీర్చుకోగలిగానన్నారు. ఒంగోలులో ఓనమాలు నేర్చుకుని నేడు ఏపీ హైకోర్టు జడ్జిగా మంచి పేరు తెచ్చుకోగలిగానని, అందుకు మీ అందరి ఆశీర్వాదమే కారణమని అన్నారు. మంచి తీర్పులు ఇవ్వాలనే దృక్పథంతో నాకు ఉన్న నిర్ణయాలు, నా ముందు ఉన్న అంశాలు సంపూర్ణంగా పరిశీలించుకుని అంతరాత్మ సాక్షిగా తీర్పులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఒంగోలు బార్ అసోసియేషన్ పాత పాలకవర్గం ఒరవడికి మరింతగా మెరుగుల దిద్ది ఉన్నతమైన సేవలతో నూతన కార్యవర్గం కొనసాగాలని సూచిస్తూ వారిని అభినందించారు. 40 సంవత్సరాలుగా ఒంగోలు బార్ అసోసియేషన్లో న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్న వారిని ఘనంగా సత్కరించారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ కె.మన్మథరావును, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతిని ఒంగోలు బార్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతి ప్రధానంతో పాటు నాగిశెట్టి మోహన్దాస్ అధ్యక్షతన ఒంగోలు బార్ అసోసియేషన్ రూపొందించిన టెలిఫోన్ డైరెక్టరీని ఆయన ఆవిష్కరించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించి ప్రస్తుతం తెలంగాణలో జడ్జిగా పనిచేస్తూ మరణించిన ఎంజీ ప్రియదర్శినిని స్మరించుకుంటూ మౌనం పాటించారు.

సత్వర న్యాయంతోనే ప్రజల నుంచి ఆదరణ