
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల నియామకం
దర్శి (కురిచేడు): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో జిల్లాకు చెందిన వారిని పలువురిని నియమించినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి శనివారం తెలిపారు. ఆమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసిందన్నారు. రాష్ట్ర స్టూడెంట్ వింగ్ జోనల్ ప్రెసిడెంట్గా దర్శికి చెందిన దుగ్గిరెడ్డి నారాయణ రెడ్డి, రాష్ట్ర అంగన్వాడీ వింగ్ ప్రధాన కార్యదర్శిగా కనిగిరికి చెందిన తమ్మినేని సుజాత, కార్యదర్శిగా దర్శికి చెందిన కందిమళ్ల గీతాంజలి, రాష్ట్ర ఎంప్లాయీస్, పెన్షనర్ల వింగ్ వైస్ ప్రెసిడెంట్గా సంతనూతలపాడుకు చెందిన డాక్టర్ నెట్టా సంజీవరావు, కార్యదర్శి గా మార్కాపురానికి చెందిన గోనావత్ ధర్మా నాయక్, సంయుక్త కార్యదర్శిగా ఒంగోలుకు చెందిన యనమదల స్వరూప్ను నియమించినట్లు ఆయన తెలిపారు.
నేడు రాష్ట్ర స్థాయి
బండలాగుడు పోటీలు
బేస్తవారిపేట: మండలంలోని జేసీ అగ్రహారంలో పట్టాభిరామ స్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ వారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ, నాల్గవ, ఐదవ బహుమతుల కింద రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు అందజేస్తారన్నారు. పూర్తి వివరాలకు 7702292595 నంబరుకు సంప్రదించాలన్నారు.
ఇళ్ల నిర్మాణంలో పురోగతి ఉండాలి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు సబర్బన్: ఇళ్ల నిర్మాణాల పురోగతిలో ప్రతివారం స్పష్టమైన పురోగతి ఉండాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. గృహ నిర్మాణాలపై ప్రకాశం భవనంలో సంబంధిత అధికారులతో శనివారం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల్లో కేటగిరీల వారీగా పురోగతిపై ఆమె ఆరా తీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీవీటీజీ చెంచులకు ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం చేస్తున్నందున ఆ డబ్బులను ఇళ్ల నిర్మాణాలకి లబ్ధిదారులు ఖర్చు పెట్టేలా చూడాలని ఆమె ఆదేశించారు. ఎంపీడీఓలు, హౌసింగ్ ఏఈలు సమన్వయంతో ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఇకపై మండలాల వారీగా కాకుండా వచ్చే సమావేశం నుంచి గ్రామాల వారీగా ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సమీక్షిస్తానని చెప్పారు. ఈ దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, ఈఈలు, డీఈలు, ఏఈలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
ఉపాధి పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు
ఒంగోలు సబర్బన్: ఉపాధి హామీ పనుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం సహించబోనని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ఎంపీడీఓలు, ఏపీఓలు వీటికి సంయుక్తంగా జవాబుదారీ అని చెప్పారు. ప్రకాశం భవనంలో సంబంధిత అధికారులతో శనివారం ఆమె ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లక్ష్యం మేరకు పనులు జరగకపోతే ఇద్దరిపైనా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ పథకం కింద జిల్లాలో నిర్వహిస్తున్న పనులు, వాటి పురోగతిని డ్వామా పీడీ వివరించారు. ఫారం పాండ్స్ పనులు త్వరగా పూర్తి చేసేందుకు మే నెలను శ్రీఫారం పాండ్స్ మాసం్ఙగా ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. దీనిపై కలెక్టరు మాట్లాడుతూ ఈ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పశ్చిమ ప్రాంతంలో, ముఖ్యంగా యర్రగొండపాలెం నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. నీటి తొట్టెల నిర్మాణాలను కూడా సత్వరమే పూర్తి చేయాలని ఆమె స్పష్టం చేశారు. వాస్తవ గడువు గత నెలలోనే ముగిసినా ఇంకా వీటిని పూర్తి చేయకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో ఒక సమాధానం చెప్పి మ్యానేజ్ చేసుకుందాములే అనుకుంటే ఊరుకోనని కలెక్టర్ హెచ్చరించారు. ఉపాధి కోరిన అందరికీ పని కల్పించాలని ఆమె స్పష్టం చేశారు. ఈ పనుల గుర్తింపునకు సంబంధించిన అనుమతులు ముందుగానే తీసుకోవాలని చెప్పారు.