
వక్ఫ్ భూములు ఉఫ్!
ఆక్రమణకు గురవుతున్న వక్ఫ్ భూములు
పొదిలి:
వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతమవుతున్నా అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండటంపై విమర్శలకు తావిస్తోంది. ఒకరిని చూసి మరొకరు వక్ఫ్ భూముల్లో పాగా వేస్తుండటంతో ఆస్తులు తరిగిపోవడంతోపాటు ఆదాయానికీ భారీగా గండి పడుతోంది. భూములు అన్యాక్రాంతమవుతున్న తీరుపై ముస్లింలు గగ్గోలు పెడుతున్నా సంబంధిత శాఖ అధికారులతోపాటు జిల్లా ఉన్నతాధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశమవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. పొదిలి మండలానికి సంబంధించి ఒంగోలు రోడ్డులోని దర్గా దగ్గర కాలువ నుంచి మర్రిపూడి రోడ్డు వరకు, బుచ్చనపాలెం సమీపంలో కొంత మేర, కాటూరివారిపాలెం సమీపంలో మొత్తం 322.24 ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నాయి. సర్వే నంబర్ 285, 325–1,325–2,325–3, 81–1, 407–2, 483–2, 806, 820, 885, 888–1, 888–2,888–4, 888–6, 889–1లో విస్తరించి ఉన్న ఈ భూములపై పర్యవేక్షణ కొరవడటంతో అక్రమార్కులు పాగా వేస్తున్నారు. ఆపై తప్పుడు రికార్డులు సృష్టించి భూములు తమవని పేర్కొంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
ఆక్రమణల జోరు..
ఒంగోలు–కర్నూలు రోడ్డులోని టైలర్స్ కాలనీ–రైల్వే బ్రిడ్జి మధ్యలో ఉన్న వక్ఫ్ భూములు ఎక్కువ భాగం ఆక్రమణకు గురయ్యాయి. గతంలో కొందరు ఆక్రమణదారులు చేసిన ప్రయత్నాలను అప్పటి అధికారులు అడ్డుకున్నారు. కానీ ప్రస్తుతం అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. అధికారులు కేవలం నోటీసులిచ్చేందుకు పరిమితం కావడం.. నోటీసులు షరా మామూలేననే ధోరణిలో ఆక్రమణదారులు ఉండటంతో విలువైన ఆస్తులకు రక్షణ లేకుండాపోయింది. పొదిలిలో 52 మంది ఆక్రమణదారులకు అధికారులు నోటీసులు పంపించారు. మరో 40 మంది భూఆక్రమణదారులకు సైతం నోటీసులు ఇవ్వాల్సి ఉన్నా ఆ దిశగా అడుగులు పడలేదు. ఆక్రమిత భూములను గుర్తించి నిందితులపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఉన్నతాధికారులు లైట్ తీసుకోవడంపై స్థానిక ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డిప్యూటీ కలెక్టర్ విచారణ వాయిదా
వక్ఫ్ భూములు అన్యాక్రాంతమవుతున్న తీరు, ఆక్రమణదారుల వ్యవహార శైలి గురించి పొదిలి పంచాయతీ వార్డు మాజీ సభ్యుడు, వైఎస్సార్ సీపీ నాయకుడు బాషా పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వక్ఫ్ సంస్థ భూములను కాపాడాలని కోరారు. దీంతో ఎట్టకేలకు డిప్యూటీ కలెక్టర్ ఇటీవల విచారణకు వచ్చారు. అయితే రికార్డులు అందుబాటులో లేవని, తహసీల్దార్ సెలవులో ఉన్నారనే కారణాలతో విచారణ వాయిదా వేశారు. మళ్లీ విచారణ ఎప్పుడు చేపడతారో స్పష్టత లేదు.
ఆదాయానికి గండి
వక్ఫ్ భూముల కౌలు వేలం ద్వారా ప్రతి సంవత్సరం లక్షల రూపాయల్లో ఆదాయం వస్తోంది. ఒక్కో ఏడాది రూ.6 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్యలో ఆదాయం వస్తున్నట్లు స్థానిక ముస్లిం మత పెద్దలు చెబుతున్నారు. ఈ ఆదాయంలో నుంచే పొదిలిలోని పెద్ద మసీదు నిర్వహణకు కొంత మొత్తాన్ని వినియోగిస్తున్నారు. చిన్నపాటి మరమ్మతు పనులకు సైతం వక్ఫ్ భూముల ఆదాయం నుంచే ఖర్చు చేస్తూ వస్తున్నారు. అయితే భూములు అన్యాక్రాంతం అవుతుండటంతో కౌలు వేలం ఆదాయం తగ్గిపోతోంది. భూవివాదాల పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు చేపట్టకపోగా సాధారణ విషయంగా పరిగణిస్తుండటంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్న పరిస్థితి నెలకొంది.
ఆక్రమణలు తొలగించేంత వరకు పోరాటం
వక్ఫ్ భూముల్లో ఆక్రమణలు తొలగించేంత వరకు పోరాటం కొనసాగిస్తా. ఎన్నోమార్లు స్థానిక అధికారుల నుంచి జిల్లా అధికారుల వరకు ఆక్రమణలపై ఫిర్యాదు చేశా. కానీ వారు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. సాక్షాత్తూ హైకోర్టు తీర్పును కూడా అధికారులు అమలు చేయడం లేదు. మళ్లీ కోర్టుకు వెళ్లయినా సరే అధికారులు చర్యలు తీసుకునేలా కృషి చేస్తా.
– ముల్లా ఖాదర్బాషా, వైఎస్సార్ సీపీ నాయకుడు
అధికారులు సహకరిస్తేనే ఆక్రమణల తొలగింపు
ఆక్రమణల తొలగింపునకు సంబంధించి వ్యవహారం తుది దశకు చేరింది. కలెక్టర్, ఎస్పీని కలిసి పలుమార్లు విన్నవించాం. వారు సంబంధిత అధికారులకు ఉత్తర్వులు ఇచ్చారు. స్థానిక అధికారులు, పోలీసుల అండతోనే ఆక్రమణలు తొలగించాల్సి ఉంది. పని ఒత్తిడి ఉందని వారు చెబుతున్నారు. వారు సహకరిస్తే త్వరలోనే ఆక్రమణలు తొలగిస్తాం.
– అహ్మద్ బాషా,
వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్

వక్ఫ్ భూములు ఉఫ్!

వక్ఫ్ భూములు ఉఫ్!

వక్ఫ్ భూములు ఉఫ్!