
గేదె పొడిచి యువకుడి మృతి
దొనకొండ: బైకుపై వెళ్తున్న యువకుడిని గేదె పొడవడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్ఐ త్యాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లంపేట గ్రామానికి చెందిన పోలు నతానియేలు (23) ద్విచక్ర వాహనంపై అదే గ్రామానికి చెందిన మరియబాబును ఎక్కించకుని కొనకనమిట్ల మండలం సిద్ధవరం గ్రామానికి వెళ్తున్నాడు. ఆరవల్లిపాడు సమీపంలో గేదెల గుంపులోని ఒక గేదె బైకుపై ఉన్న నతానియేలును పొడిచింది. ఆయన ఎడమ వైపు కాలర్ బోన్ కింద భాగంలో తీవ్ర గాయమైంది. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. నతానియేలు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై త్యాగరాజు తెలిపారు.