
ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలి
ఒంగోలు వన్టౌన్: ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలని, లేకుంటే ఉద్యమ బాట పడతామని మాల ఉద్యోగుల సంఘం, మాల జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఒంగోలు అంబేడ్కర్ భవన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టీ అశోక్బాబు మాట్లాడుతూ చంద్రబాబు ఎస్సీ వర్గీకరణకు దొడ్డిదారిన ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాలలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితులను చీల్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రపన్నాయన్నారు. పిఠాపురంలో మాలలను గ్రామ బహిష్కరణ చేయడాన్ని ఖండించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సంఘటనపై మౌనం దాల్చడం కుల వివక్షేనన్నారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా ఏక పక్షంగా వర్గీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎం శాంతారావు, కే ఏడుకొండలు, బీ రాజు, పీ మాల్యాద్రి, వై రమేష్ తదితరులు పాల్గొన్నారు.