Warangal West Assembly Constituency TRS - Sakshi
Sakshi News home page

అక్కడ టీఆర్‌ఎస్‌ హవానే కొనసాగేనా?

Aug 14 2022 3:28 PM | Updated on Aug 14 2022 4:21 PM

Warangal West Assembly constituency TRS - Sakshi

గ్రేటర్ వరంగల్‌లోని పశ్చిమ నియోజకవర్గం టిఆర్ఎస్ కు కలిసొచ్చే స్థానంగా చెప్పుకోవాలి. పశ్చిమ నుంచి అసెంబ్లీ కి ప్రాతినిధ్యం వహిస్తున్న దాస్యం వినయ్ భాస్కర్ ఇప్పటికే నాలుగుసార్లు గెలిచి ఐదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇక్కడ మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉన్నప్పటికీ టిఆర్ఎస్ హవానే కొనసాగే పరిస్థితులు ఉన్నాయి.‌ 2009 నుంచి వినయ్ భాస్కర్‌కు ఎదురులేదనే చెప్పాలి.‌ వినయ్ భాస్కర్ కు సీఎం కేసీఆర్ మంత్రి కేటిఆర్ ఆశిస్సులు ఉన్నాయి. వాటికి తోడు కాంగ్రెస్, బిజేపి లోని గ్రూప్ రాజకీయాలు వినయ్ భాస్కర్ కు అనుకూలంగా మారుతున్నాయి. అయితే వచ్చే ఎన్నికలు వినయ్ భాస్కర్ కి అంత ఈజీ కాదనే చర్చ సాగుతుంది.

ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున నాయిని రాజేందర్ రెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ పోటీకి సిద్ధమవుతున్నారు. రాజేందర్ రెడ్డి ప్రస్తుతం హన్మకొండ , వరంగల్ జిల్లాలకు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. 2018లో ఇక్కడి నుండి పోటీ చేద్దామనుకున్న రాజేందర్ రెడ్డికి నిరాశే ఎదురైంది. పొత్తులో భాగంగా ఈ స్థానం టీడీపీ కి ఇవ్వడంతో రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు.

ఇటీవల జరిగిన రాహుల్ గాంధీ వరంగల్ బహిరంగ సభ సక్సెస్ తో‌ రేవంత్ రెడ్డి అనుచరుడిగా ముద్రపడ్డ వేం నరేందర్ రెడ్డి సైతం వరంగల్ పశ్చిమపై కన్నేసినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ నుంచి మొత్తం నలుగురు టిక్కెట్ ఆశిస్తుండగా.. టిక్కెట్ రానివారు ఇతర పార్టీల్లోకి మారడం లేదా సైలెంట్ గా ఉండి కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడమే లక్ష్యంగా పావులు కలిపే అవకాశాలు లేకపోలేదు. ఇక పట్టణ ప్రాంతాల్లో ఓటు బ్యాంకు పెంచుకుంటున్న బీజేపీ నుంచి పోటీకి ముగ్గురు రెడీ అవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ధర్మారావు , హన్మకొండ జిల్లా పార్టీ అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. 

ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రస్తుతం టిఆర్ఎస్ కోటగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఒంటెద్దు పోకడతో గులాబీ గూటిలో ముసలం పుట్టి గ్రూప్ రాజకీయాలతో ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. అధికార పార్టీ లోని గ్రూప్ రాజకీయాలను అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్, బిజేపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మూడున్నరేళ్ళలో మారిన పరిణామాల కారణంగా..నన్నపనేని నరేందర్ కి పోటీగా బస్వరాజ్ సారయ్య , గుండు సుధారాణి , ఎర్రబెల్లి ప్రదీప్ రావు రేస్‌లో వుండే అవకాశం లేకపోలేదు. ఒకరంటే ఒకరికి పడక వర్గపోరు తీవ్రం అవుతుండడంతో టిఆర్ఎస్ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది.

కాంగ్రెస్ పార్టీ నుండి ప్రస్తుతానికి కొండా సురేఖ ఒక్కరే పోటీలో కనిపిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో పద్మశాలి సామాజికవర్గం ఓట్లు ఎక్కువ ఉండడం కొండా సురేఖకి కలిసివచ్చే అంశం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంతో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయం పాలయింది.‌

వరంగల్ తూర్పుతో పాటు పరకాల, పాలకుర్తి నియోజకవర్గాలు తమ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కొండా ఫ్యామిలీ కోరుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత, టిఆర్ఎస్ లో వర్గ పోరు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 4 వేల ఓట్లకు పరిమితమైన బిజెపి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 45 వేల ఓట్ బ్యాంక్ సాధించుకోగలిగింది. తూర్పు ప్రజలు బిజెపికి కాస్త సానుకూలంగా ఉన్నప్పటికీ సరైన నాయకత్వం లేకపోవడం బీజేపీకి మైనస్ పాయింట్ గా మారింది. అయితే ఇది పూర్తిగా అర్బన్ ప్రాంతం కనుక బీజేపీకి కలిసి వస్తుందని భావిస్తున్నారు.

పాలకుర్తి నియోజకవర్గం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు కంచుకోట. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఎమ్మెల్యే గా దయాకర్ రావు ను దీవించడం నియోజకవర్గ ప్రజలకు పరిపాటిగా మారింది. విపక్ష అభ్యర్థుల బలహీనతలను అనుకూలంగా మార్చుకుని ఎర్రబెల్లి జయకేతనం ఎగురవేస్తున్నారు. దయాకర్ రావును ఢీకొట్టే సరైన నాయకుడు ఇతర పార్టీల్లో లేకపోవడం ఆయనకు కలిసోస్తుందనే అభిప్రాయం వ్యక్త మవుతుంది. కానీ రాబోయే ఎన్నికల్లో మంత్రికి చుక్కలు చూపేందుకు రాజకీయ ప్రత్యర్ధి కొండా మురళి కాంగ్రెస్‌ నుంచి బరిలో దిగుతారనే ప్రచారం సాగుతోంది. బీజేపీ నుండి గత ఎన్నికల్లో పెదగోని సోమయ్య పోటీ చేసి ఓడిపోయారు. ఎర్రబెల్లి సుధాకర్ రావు , యతిరాజారావు కుటుంబం నుండి ఒకరు పోటీ చేయాలని భావిస్తున్నారు. ఎవరు పోటీ చేసినా బిజేపి పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement