తాడేపల్లి : రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై చంద్రబాబు ద్రోహాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సూచించారు వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ రోజు(సోమవారం, మార్చి 23వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. దీనికి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నేతలు హాజరయ్యారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై చంద్రబాబు ద్రోహాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. జిల్లాల స్ధాయిలో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసుకుని కార్యాచరణ చేపట్టాలి. వచ్చే రెండు మూడు నెలలు ప్రతి వారం, పది రోజులకోసారి జిల్లా స్ధాయిలో సమావేశాలు నిర్వహించాలి.
విద్యార్ధి, యువజన, రైతు విభాగాలను మరింత భాగస్వామ్యం చేయాలి. రాయలసీమ జిల్లాలలో ప్రతి ఇంటికి కరపత్రాల ద్వారా రాయలసీమ లిఫ్ట్ ఆగిపోవడం వల్ల జరుగుతున్న నష్టంపై వివరించాలి. ఇరిగేషన్ ప్రాజెక్ట్లలో కూటమి ప్రభుత్వ నిర్వాకం వల్ల జరుగుతున్న అన్యాయాలను తీసుకెళ్ళాలి. అల్మట్టి ఎత్తు పెంపు, పోలవరం ఎత్తు తగ్గింపు వల్ల రాష్ట్రానికి జరుగుతున్న నష్టం, రైతాంగానికి వచ్చే సమస్యలు తదితర అంశాలపై ఆయా జిల్లాలలో సమావేశాలు నిర్వహించాలి’ అని పేర్కొన్నారు.


