
తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రత్నామ్నాయం ఎవరు? గత కొద్ది రోజులుగా పార్టీలోను, పార్టీ బయట వినిపిస్తున్న ప్రశ్న ఇది. నైపుణ్యాభివృద్ది సంస్థ కుంభకోణంలో చిక్కుకుని అరెస్టు అయి రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు నాయుడు స్థానంలో ఎవరు ఆ పార్టీకి నాయకత్వం వహించగలరు? ఆయన మాదిరి ఆర్దిక వ్యవహారాలు, ఇతరత్రా మానిప్యులేషన్, మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న నేత ఎవరు? అన్నది ఆసక్తికరమైన ప్రశ్నగా ఉంది.
చంద్రబాబుకు బెయిల్ ఎప్పటికి వస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఆయన సత్వరమే జైలు నుంచి విడుదల అయితే ఫర్వాలేదు. అలా కాకుంటే పార్టీ పరిస్థితి ఏమిటి అన్నది అర్ధం కావడం లేదు. దానికి కారణం ఆయన ఇంతవరకు తన తర్వాత మరో నేతకు పార్టీలో కీలక పాత్ర ఇవ్వకపోవడం.వయసు మీద పడుతున్నా తానే నాయకత్వంలో ఉండాలని కోరుకోవడం మరో కారణం కావచ్చు. ఆయన కుమారుడు లోకేష్ను తన తర్వాత నాయకుడిగా చేయాలని తలపోసి ఆ ప్రకారం వ్యూహాత్మకంగా ముందుకు సాగారు. ఈ తరుణంలో స్కామ్లో చిక్కుకుని చంద్రబాబు జైలుకు వెళ్లవలసి వచ్చింది.
బాలకృష్ణకు బాధ్యతలు అప్పగించడం ఇష్టం లేదా?
మరో ఏడెనిమిది కేసులు ఆయనను వెంటాడుతున్నాయి. అవి అన్ని ఒక్కసారిగా వచ్చి మీద పడితే కనీసం రెండు, మూడు నెలలపాటు జైలులో ఉండవలసి రావచ్చన్న అభిప్రాయం ఉంది. అదే నిజమైతే పార్టీ గందరగోళంలో పడుతుంది. పోనీ లోకేష్ నాయకత్వం సరిపోతుందా అనుకుంటే పార్టీలో ఆయనపై అంత నమ్మకం లేదు. ఈ మధ్య ఆయన అభ్యర్దుల ప్రకటన, మరికొన్ని నిర్ణయాలు సొంతంగా తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నా, అంత మెచ్యూరిటీ ఇంకా రాలేదన్నది పార్టీ వర్గాల భావనగా ఉంది. ఇదే స్కిల్ స్కామ్ కేసులో లోకేష్ కూడా అరెస్టు అయితే పరిస్థితి మరింత దయనీయంగా తయారవుతుంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్కుమారుడు, తన బావమరిది బాలకృష్ణకు నాయకత్వ బాద్యతలు అప్పగించడం అంత ఇష్టం లేదనిపిస్తుంది.
బాలకృష్ణ పార్టీ కార్యాలయంలో కాస్త హడావుడి చేసినట్లు కనిపించినా, యనమల రామకృష్ణుడు వంటి సీనియర్లు ఏదో మొక్కుబడిగా కూర్చున్నారు తప్ప అంత సీరియస్ నెస్ చూపలేదు.పైగా బాలకృష్ణ టెంపర్ మెంట్ రీత్యా ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో తెలియదు. ఆయన తన ఇంటిలో ఇద్దరు సినీ ప్రముఖులను తుపాకితో కాల్చిన ఘట్టాన్ని , ఆయా చోట్ల తన అభిమానులపై చేయి చేసుకోవడాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ నేపద్యంలోనే ఆంధ్రజ్యోతి మీడియా బాలకృష్ణ పార్టీ కార్యాలయంలోకాని, ఇతరత్రాకాని గత కొద్దిరోజులుగా చేసిన యాక్టివిటికి ఎలాంటి పబ్లిసిటీ ఇవ్వలేదని అంటున్నారు. ఈనాడు మీడియా కూడా అదే రీతిలో ఆయనకు ప్రాముఖ్యత తగ్గించింది. ఈ పరిస్థితిలోనే చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైనే ఆదారపడవలసి వచ్చిందని, ఆయన రెండు పార్టీల తరపున పర్యటనలు చేస్తే ప్రయోజనంగా ఉంటుందేమోనన్న ఆలోచన ఉండవచ్చు.
అదే జరిగితే పార్టీ క్యాడర్ మరింత డీలా
మరీ నేరుగా పవన్ పై ఆధారపడితే పార్టీ క్యాడర్ మరింత డీలా పడే అవకాశం ఉందన్న భయమూ లేకపోలేదు. జూనియర్ ఎన్టీఆర్ను పిలిచి పార్టీ పని చేయాలని కోరదామన్నా ,ఇంతకాలం తనను అవమానించారని, ఇప్పుడు అవసరం వచ్చిందని అడుగుతారా అని ఆయన అనవచ్చు.పార్టీలోకి వస్తారన్న గ్యారంటీ లేదు. చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో ఎలాంటి స్పందన ఇవ్వకుండా జాగ్రత్తగా ఉన్న ఎన్టీఆర్పై టీడీపీ సోషల్ మీడియావారు విపరీతంగా విరుచుకుపడ్డారు.ఈ నేపధ్యంలో ఆయన పార్టీకి అండగా నిలబడకపోవచ్చు.ఆయన పార్టీలోకి వస్తే లోకేష్ కు పోటీ అవుతారు కనుక ఆ అవకాశం లేనట్లే. ఒకవేళ లోకేష్ ఫెయిల్ అయితే , అప్పుడు జూనియర్ ఎన్టీఆర్రాజకీయాలలోకి వస్తే ఎలా ఉంటుందో అప్పుడే చెప్పలేం. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన కొత్తలో తన అల్లుడు చంద్రబాబు నాయుడును పార్టీలోకి రావాలని కోరినా, అంగీకరించక, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగారు. 1983లో ఓటమి తర్వాత తన మామ కనుక ఇబ్బంది లేకుండా టీడీపీలో ప్రవేశించారు. అప్పటినుంచి వ్యూహాత్మకంగా తన సొంతవర్గాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు.
అప్పట్లో ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా మరో వర్గానికి నాయకత్వం వహించినా, ఆయన పూర్తి స్తాయి లో డామినేట్ చేయలేకపోయారు. దానికి తోడు 1989 ఎన్నికలలో లోక్ సభకు పోటీ చేయడంతో ఎమ్మెల్యేలకు కాస్త దూరం అయ్యారు. ఎన్టీఆర్ ను దించడంలో చంద్రబాబుకు స్నేహ హస్తం అందించినా, ఆ తర్వాత చంద్రబాబు ఈయనకు మొండి చేయి చూపారు.దాంతో దగ్గుబాటి హతాశుడయ్యారు. దగ్గుబాటి టీడీపీ నుంచి వెళ్లిపోయేలా చేయడంలో చంద్రబాబు,ఈనాడు అదినేత రామోజీరావు ద్వయం సఫలం అయ్యారు.అందువల్ల దగ్గుబాటి టీడీపీలో ప్రత్యామ్నాయం అయ్యే అవకాశం లేకుండా పోయింది.
ఆమెకు అవకాశం లేదు..
ఇప్పటివరకు ఆయన కొనసాగి ఉంటే ఏమైనా అవకాశం వచ్చేదేమోకాని, ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఎన్టీఆర్పెద్ద కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరికి రాజకీయాలపై మక్కువ ఉన్నా తండ్రి టైమ్ లో ఎంటర్ కాలేకపోయారు. 2004లో ఆనాటి కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో రాజకీయాలలోకి వచ్చి ఎమ్.పి అయి కేంద్ర మంత్రిగా కూడా నియమితులయ్యారు. రెండుసార్లు గెలిచాక ఆమె కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి జంప్ చేసి జాతీయ స్థాయిలోనే పదవులు నిర్వహించారు. ప్రస్తుతం బీజేపీరాష్ట్ర శాఖ అధ్యక్షురాలిగా ఉన్నారు.
ఆమె వేరే పార్టీలో ఉన్నారు కనుక టీడీపీలో ప్రత్యామ్నాయ బాద్యతలకు అవకాశం లేదు. ఎన్టీఆర్మరో కుమారుడు హరికృష్ణ రాజకీయాలలో యాక్టివ్ గా ఉన్నా చంద్రబాబు చేతిలో దెబ్బతిన్నవారిలో ఒకరయ్యారు.రోడ్డు ప్రమాదంలో మరణించకుండా జీవించి ఉన్నట్లయితే బాద్యతలు తనకు ఇవ్వాలని అడిగేవారేమో. బాలకృష్ణ రెండుసార్లు హిందుపూర్ నుంచి గెలిచినా, మంత్రిపదవి పొందడమో, రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక వర్గమో తయారు చేసుకోలేకపోయారు.బాలకృష్ణ ను ఎన్టీఆర్ వారసుడుగా ఎన్టీఆర్ 1986 లో ప్రకటిస్తే , దానిని చంద్రబాబు నాయుడు కుటుంబ పాలన అంటారని చెప్పి విత్ డ్రా చేయించారు. అంతేకాక ఏకంగా ఆయనను వియ్యంకుడుగా చేసుకుని తనకు పోటీ లేకుండా చేసుకోగలిగారు.
ఎన్టీఆర్ మిగిలిన పిల్లలు ఎవరూ పెద్దగా రాజకీయాలలో లేరనే చెప్పాలి. ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతిని ఎటూ దగ్గరకు రానివ్వలేదు. ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిని చేసిన తర్వాత తనకంటూ వివిధ వర్గాలలో కోటరీని సృష్టించుకోవడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ప్రత్యేకించి ఆర్దిక వ్యవహారాలను కొద్దిమందితోనే చక్కబెట్టేవారు. రాజకీయాలలో డబ్బు ప్రభావాన్ని చంద్రబాబు బాగా పెంచారు. విశేషం ఏమిటంటే ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎంత డబ్బు ఖర్చు పెడతారో లెక్కేలేదని కొందరు చెబుతారు. అభ్యర్ధులు అడిగినదానికన్నా ఎక్కువ మొత్తాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని చెబుతారు.తెలంగాణ ఉద్యమ సమయంలోకాని, ఇతరత్రా కాని పార్టీ మారతామని ఎవరైనా బెదిరిస్తే వారికి కూడా డబ్బు ఇచ్చేవారని ప్రచారం జరిగేది.
ఈ రకంగా పార్టీలోని ఇతర నేతలను మేనేజ్ చేస్తూ అదే సమయంలో వారెవ్వరూ తనతో పోటీపడకుండా చూసుకున్నారు.డబ్బు విషయంలో ఇతర పార్టీలు ఏ మాత్రం కొరగాకపోయేవి. అలాగే ఎప్పుడు ఏ అవకాశం వస్తే దానిని వినియోగించుకుని, ఎప్పటికప్పుడు కూటమిలు మార్చేసి చాలావరకు లాభం పొందారు.ఒకరకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయకత్వ పటిమతో కంటే డబ్బు రాజకీయం, అదృష్టం కలిసి వచ్చి కూడా ఇంతకాలం రాజకీయాలలో ఉండి సుదీర్ఘకాలపు ముఖ్యమంత్రిగా నమోదు కాగలిగారన్నది అప్పటి నుంచి రాజకీయాలు పరిశీలించే కొందరి అభిప్రాయం.
మొత్తం ఆర్దిక లావాదేవీల గుట్టుమట్లన్నీ తన చేతిలో పెట్టుకుని పార్టీని నడిపిన చంద్రబాబు 2019 లో కాస్త ఇబ్బంది పడ్డారు. తనకు డబ్బులు ఇచ్చే పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు వంటివారి నుంచి డబ్బు సేకరించినా, కుటుంబ సభ్యులు దానిని ఖర్చు పెట్టనివ్వలేదన్న ప్రచారం అప్పట్లో ఉంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఆదాయపన్ను శాఖ, సిబిఐ, ఈడి వంటివి యాక్టివ్ గా ఉండడంతో చంద్రబాబు ఈ విషయంలో ముందుకు వెళ్లలేకపోయారు. తదుపరి ప్రతిపక్ష నేతగా ఉన్నా కొంత ఖర్చు భరిస్తూ వస్తున్నారని అంటారు. కాని సడన్ గా ఈ కేసులో జైలుకు వెళ్లడం వల్ల పార్టీతో పాటు ఆయన కూడా పెద్ద సంక్షోభంలో పడ్డట్లయిందని భావిస్తున్నారు.
పార్టీలో ఎవ్వరినీ ఎదగనివ్వలేదు.. అందుకే ఈ పరిస్థితి
పార్టీలో మరెవ్వరిని ఎదగనివ్వకుండా చేయడం కూడా పార్టీకి ఇరకాటంగా మారింది.పలితంగా సీనియర్ నేతలు మౌనం దాల్చితే, మరీ గాలి కేసులు, చోటా మోటా నాయకులు ఎక్కువ మంది పార్టీ ఆఫీస్లో చక్రం తిప్పుతున్నారన్న అభిప్రాయం పార్టీ వర్గాలలో ఉంది. ఫలితంగా పార్టీకి ఒక విలువ లేకుండా పోయింది. 1983 నుంచి పార్టీలో ఉండి పలుమార్లు ప్రజాప్రతినిదులుగా ఎన్నికైన నేతలలో కళా వెంకటరావు, ప్రతిభా భారతి, అశోక్ గజపతిరాజు,అయ్యన్నపాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, యనమల రామకృష్ణుడు వంటి వారు కొద్ది మంది ఉన్నా, వీరిలో ఎవరికి పార్టీపై పట్టురానివ్వలేదు.
ఆ తర్వాత కాలంలో వచ్చిన వారిలో దేవినేని ఉమ, గద్దె రామ్మోహన్ రావు,గంటా శ్రీనివాసరావు, కేశినేని నాని, గల్లా జయదేవ్,సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పయ్యావుల కేశవ్ , రామ్మోహన్ నాయుడు,ధూళిపాళ్ల నరేంద్ర వంటి కొంతమంది ఉన్నా వీరిలో కొద్ది మంది మినహా రాష్ట్ర పార్టీ వ్యవహారాలలో జోక్యం చేసుకునేవారే తక్కువ.తమ నియోజకవర్గం, సొంత జిల్లాకే పరిమితం అవుతుంటారు.సుజనా చౌదరి ,సి.ఎమ్.రమేష్ లతో ఆర్ధిక లావాదేవీలు నిర్వహిస్తుంటారని పార్టీలో చెప్పుకుంటారు.కాని వారిద్దరిని బిజెపిలోకి పంపించారు. విద్యాసంస్థల నారాయణ తో ఆర్ధిక సంబంధాలు ఉన్నా, ఆయన కూడా అటు కుటుంబ పరంగా, ఇటు కేసుల పరంగా సమస్యలలో ఉన్నారు.వీరందరిని ఆయా అవసరాలకు వాడుకోవడం తప్ప ఇతరత్రా బాద్యతలు ఇవ్వలేదు. అందువల్ల వారు చొరవ తీసుకునేపరిస్థితి లేదు. పైగా తన కుమారుడులోకేష్ కే నాయకత్వ అవకాశం ఇవ్వాలని తలపెట్టిన చంద్రబాబు వీరిలో ఎవరికి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు.ప్రాంతీయ పార్టీలలో ఇలాంటి సమస్యలు సహజంగానే కొంత ఉండవచ్చు.
కొన్ని రాష్ట్రాలను పరిశీలిస్తే, తమిళనాడులో గట్టి వారసులుగా ఉన్న స్టాలిన్, ఆ తర్వాత ఉదయనిధి, బీహారులో ఆర్జెడి నేతలు తేజస్వి, తేజ్ దీప్,యుపిలో అఖిలేష్ యాదవ్, తెలంగాణలో కేటీఆర్, హరీష్ రావు, మహారాష్ట్రలో శివసేన నేత ఉద్దావ్ ఠాక్రే, జమ్ముకశ్మీర్ లో ఒమర్ అబ్దుల్లా,కర్నాటకలో కుమారస్వామి, ఇలా కొన్ని పార్టీల నేతలు రాజకీయాలలో బాగా క్రియాశీలకంగా ఉండగలుగుతున్నా,కీలక పదవులలో ఉండగలుగుతున్నా, కొన్ని ప్రాంతీయ పార్టీలలో సరైన రాజకీయ వారసత్వం లేకపోతే దెబ్బతినే పరిస్థితి ఉంటోంది. బీఎస్పీ అధినేత్రి మాయావతి గతంలో బలమైన నేతగా ఉన్నా,ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
భవిష్యత్తులో మరీ కష్టం కావచ్చు. తమిళనాడులో ప్రముఖ నటుడు విజయకాంత్ పార్టీని కొంతకాలం బాగానే నడిపినా, ఆ తర్వాత వెనుకబడిపోయారు. బీహారులో నితీష్ కుమార్ తర్వాత జేడీయూ నిలబడుతుందో లేదో తెలియదు. ఒడిషాలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా తన వారసుడు ఎవరో ప్రకటించలేదు. తమిళనాడులో ఎమ్జిఆర్ స్థాపించిన అన్నా డి.ఎమ్.కె. పలు సంక్షోభాలను ఎదుర్కుంది. జయలలిత మరణం తర్వాత మళ్లీ సుడిగుండంలో చిక్కుకుంది.ఇలా ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. లోకేష్ ఈ కేసులలో ఇరుక్కోకుండా ఉండి,పార్టీని సమర్ధంగా నడిపించేలా ఎదిగితే ఫర్వాలేదు కాని, ప్రస్తుతానికి ఆయనకు ఆ గ్యారంటీ ఇవ్వలేం. అందువల్ల పూర్తిగా కుటుంబ పార్టీగా మారిన తెలుగుదేశంలో చంద్రబాబుకు ప్రత్యామ్నాయం ఎవరు అంటే చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని అనుకోవచ్చు.
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్