అడవిలోనా.. బీచ్‌లోనా? 

Kodali Nani Fires On Chandrababu - Sakshi

చంద్రబాబుకు కొడాలి నాని సవాల్‌ 

నల్లమల లేదంటే బందర్‌ వెళ్దాం 

తేల్చుకుందాం.. వచ్చెయ్‌ 

ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుంది 

సాక్షి, అమరావతి: ‘ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్‌.. నీ ప్రతిపక్ష హోదాతోపాటు జడ్‌ కేటగిరీ సెక్యూరిటీ కూడా వదులుకో.. నేనూ, వంశీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తాం. నల్లమల అడవికో, బందరు బీచ్‌కో వెళ్లి కొట్టుకుందాం..’ అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు మాజీ మంత్రి కొడాలి నాని (శ్రీవెంకటేశ్వరరావు) ప్రతి సవాల్‌ విసిరారు.

‘మన పోరాటంలో మేం చచ్చిపోతే నిన్ను జైల్లో పెడతారు.. నువ్వు చస్తే మమ్మల్ని జైల్లో వేస్తారు. ఈ రాష్ట్రానికి పట్టిన నీ దరిద్రం పోతుంది’ అని చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. 

► రెండు గ్లాసులు, ఒక కంప్యూటర్‌ పగిలిన కార్యక్రమాన్ని చూసేందుకు గన్నవరం వెళ్లిన చంద్రబాబు పిచ్చి పట్టినట్లుగా సీఎం జగన్‌ను నోటికొచ్చినట్లు దూషిస్తున్నారు. ఆయన అరుపులు విని పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకుని వచ్చారని గన్నవరం ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు. చంద్రబాబును పిచ్చాసుపత్రిలో చేర్చాలి. లేదంటే రామ్మూర్తినాయుడిని కట్టేసినట్లుగా చంద్రబాబును కుటుంబ సభ్యులే బంధించాలి.  

​​​​​​​► బ్రెయిన్‌లెస్‌ కిడ్‌ లోకేశ్‌.. పిల్లోడు, రాజకీయాలు తెలియనోడు. కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వ్యక్తి తెలిసీ తెలియకుండా మాట్లాడుతున్నాడని జనం అనుకుంటారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నానని చెప్పుకునే చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారంటే లోకేశ్‌ ఆయన్ను కొరికి ఉంటారేమోననే  అనుమానం కలుగుతోంది. దీర్ఘాలు తీస్తూ సినిమా డైలాగులు చెబుతున్న చంద్రబాబు ఖాళీగా ఉండలేక అఖండ,  వీరసింహారెడ్డి సినిమాలు ఏమైనా చూశారా? ఆయన పిచ్చి మాటలు నమ్మి కేసుల్లో ఇరుక్కుని చివరకు జైలు పాలవుతున్నారు. 

​​​​​​​► ఎమ్మెల్యే వంశీని పశువుల డాక్టర్‌ అని ఎద్దేవా చేస్తున్న చంద్రబాబు మూగ జీవాల  పాల ఉత్పత్తులతో వ్యాపారం చేసి కోట్లు కూడబెడుతుండటం నిజం కాదా? ఆయన దిక్కుమాలిన రాజకీయం నాకు, వంశీకి చాలా బాగా తెలుసు. మాతో పెట్టుకోవద్దు. పట్టాభిని గన్నవరం పంపిందే చంద్రబాబు. అక్కడ ఏ పార్టీ వారికీ గాయాలు కాలేదు. ఘర్షణ కట్టడి చేయడానికి వెళ్లిన పోలీసులకు మాత్రమే గాయాలయ్యాయి. టీడీపీ మూకల దాడిలో సీఐ తల పగిలి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే చంద్రబాబు పోలీసుల తాట తీస్తానంటూ బెదిరిస్తున్నారు. సీఐ, డీజీపీ క్రిస్టియన్‌ అంటూ మతాల పేరిట రెచ్చగొట్టే యత్నాలను ప్రజలు గమనించాలి. 

అందుకు టెలిఫోన్‌ ఆపరేటర్‌ చాలు.. 
గూగుల్‌ టేకవుట్‌ ఏమిటి? ఒక లొకేషన్‌ నుంచి ఎంతమంది ఫోన్లలో మాట్లాడారో చెప్పేందుకు సీబీఐ ఎందుకు? ఒక టెలిఫోన్‌ ఆపరేటర్‌కు అప్పగిస్తే ఎప్పుడో తేల్చేసే వారు. ఎవరి ఫోన్‌ ఎవరికి వెళ్లిందో చెప్పేదాన్ని సీబీఐ ఎంక్వైరీ అనరు. దాన్ని టీవోఐ (టెలిఫోన్‌ ఆపరేటర్‌ ఎంక్వైరీ) అని నేను భావిస్తున్నా.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top