పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే ఆమెను డిస్మిస్ చేయాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సూచించారు. బెంగాల్ ప్రజలు ఆమె తప్పిదాలు, చర్యలను చాలా కాలంపాటు సహించారని చెప్పారు.
"ఆమె రాజీనామా చేయకపోతే ఆమెను డిస్మిస్ చేస్తారు. దేశం ఆమె ఇష్ట ప్రకారం నడవదు. గవర్నర్ కొంతకాలం వేచి ఉంటారు. ఆ తర్వాత ఆమెను తొలగిస్తారు.. అంతే, ఈ ప్రక్రియ సులభం. ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 100 సీట్లు మీ నుంచి దోచుకున్నారని అంటున్నారు? అయితే, నేను కూడా అస్సాంలో కాంగ్రెస్ గెలిచిన 19 సీట్లను నా నుంచి దోచుకున్నారని అనొచ్చు. నాకు 126 రావాలి అనొచ్చు. దేశం అలా పనిచేయదు" అని అన్నారు.
"మీరు సరిహద్దులో కంచె ఏర్పాటుకు అనుమతించరు. ఇప్పుడేమో సీట్లు దోచుకున్నారని అంటారు. ఈ ఫలితం చాలా కాలం క్రితమే రావాలి. బెంగాల్ ప్రజలు మీకు చాలా ఇచ్చారు. ఇప్పుడు వారు బీజేపీకి మద్దతు ఇచ్చారు. మీరు 'నేను రాజీనామా చేయను' అంటారు. సమాజం మీ నిర్ణయంతోనే నడుస్తుందా? ఎస్ఐఆర్ను ఉపయోగించి ఓటు దోపిడీ జరిగిందని, ప్రభుత్వం, ఎన్నికల సంఘం కలిసి పనిచేశాయని చేస్తున్న ఆరోపణలకు సాక్ష్యం ఎక్కడ?" అని ప్రశ్నించారు.
కాగా, గత 15 ఏళ్లుగా సీఎంగా కొనసాగిన మమతా బెనర్జీ బీజేపీ చేతిలో ఓడిపోయారు. ఇవాళ రాజీనామా ఇవ్వడానికి నిరాకరించారు. ఆమె తీరు వల్ల ఊహించని పరిస్థితి ఏర్పడింది. "నేను ఓడిపోలేదు, కాబట్టి రాజ్ భవన్కు వెళ్లను. రాజీనామా ఇవ్వను" అని మమతా బెనర్జీ మీడియాతో చెప్పారు.
గవర్నర్ సాంకేతికంగా ముఖ్యమంత్రిని తొలగించొచ్చు. అయితే కొన్ని నియంత్రణలు ఉన్నాయి. గవర్నర్ అధికారాలను సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టంగా నిర్దేశించాయి. అసెంబ్లీకి ఉన్న గడువు మే 7. అది పూర్తయ్యేలోపే గెలిచిన పార్టీ ముందుకు వచ్చి “మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం” అని చెబితే.. గవర్నర్ వారిని ఆహ్వానించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయిస్తారు. అలా జరిగితే మమతా బెనర్జీని ప్రత్యేకంగా తొలగించే అవసరం ఉండదు.


