
కంపుకొడుతున్న కాలువలు
● డ్రెయినేజీల్లోనే పూడిక ● తొలగించడంలో నిర్లక్ష్యం ● మురుగునీటి పారకానికి ఆటంకం ● దుర్గంధం వెదజల్లుతున్న కాలనీలు
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో మురుగునీటి కాలువలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. పూడిక నిండిపోయి మురుగునీరు ఎక్కడికక్కడే నిలిచిపోతోంది. దోమలు, ఈగలు ఆవాసాలుగా ఏర్పాటు చేసుకుని స్థానికులపై దాడులు చేస్తున్నాయి. ఫలితంగా కాలనీవాసులు వ్యాధులకు గురవుతూ ఆస్పత్రుల పాలవుతున్నారు.
అస్తవ్యస్తంగా డ్రైనేజీలు..
రామగుండం కార్పొరేషన్ 19వ డివిజన్ న్యూమారేడుపాక గ్రామంలో సీసీ రోడ్లకు ఇరువైపులా నిర్మించిన సైడ్ డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. శ్రీనాగుల మల్లికార్జునస్వామి ఆలయానికి వెళ్లే మెయిన్ రోడ్డుకు ఇరువైపులా మురుగునీటి కాలువలు నిర్మించాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా ఆయా నివాసాల్లోంచి వెలువడే మురుగునీరు ఇళ్లోకి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సీసీ రోడ్లు నిర్మించినా..
కొన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్లు నిర్మించిన బల్దియా అధికారులు.. వాటికి సైడ్ డ్రెయినేజీలు నిర్మించడం విస్మరించారు. న్యూమారేడుపాక బీసీకాలనీలో రోడ్లు నిర్మించినా అండర్గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మించలేదు. దీంతో ప్రతీ వర్షకాలంలో వర్షపు నీరు, బురదనీరు, మురుగునీరు సమీప ఇళ్లలోకి వచ్చి చేరుతోంది. ఆ దుర్గంధం కాలనీ వాసులు భరించలేకపోతున్నారు.
పందులకు ఆవాసాలు..
రోడ్లు, నివాసాల మధ్య వర్షపునీరు, మురుగునీరు నిలవడంతో పెద్దగుంతలుగా తయారవుతున్నాయి. వాటిని పందులు తమ ఆవాసాలుగా చేసుకుంటున్నాయి. ఇళ్లలోకి దుర్వాస వస్తోంది. దోమలు, ఈగలు వృద్ధి చెంది మలేరియా, డెంగీ, డయేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని కాలనీవాసులు అంటున్నారు. ఇప్పటికై నా ఆర్జీ–2సింగరేణి అధికారులు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెంటనే స్పందించి వర్షకాలం రాకముందే అండర్గ్రౌండ్ డ్రెయినేజీతోపాటు రహదారులకు ఇరువైపులా సైడ్ డ్రెయినేజీలు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
అధికారుల దృష్టికి తీసుకెళ్తా
న్యూమారేడుపాక గ్రామంలోని కొన్ని ఏరియాల్లో సీసీ రోడ్లతోపాటు డ్రెయినేజీల నిర్మాణం విషయాన్ని ఆర్జీ–2ఏరియా సీంగరేణి యజ మాన్యం దృష్టికి తీసుకెళ్తాం. అసంపూర్తిగా మిగిలిన సీసీ రోడ్లు నిర్మించేలా చర్యలు తీసుకుంటాం. – తాళ్ల అమృత,
19వ డివిజన్ మాజీ కార్పొరేటర్

కంపుకొడుతున్న కాలువలు