 
															వెన్ను వంచుతున్న వాన
● అకాల వర్షాలు.. రైతన్నకు కష్టాలు ● పరిహాసంగా పంట నష్టపరిహారం ● శరాఘాతంగా ప్రభుత్వ నిబంధనలు 
సాక్షి, పార్వతీపురం మన్యం:
అకాల వర్షాలు.. తుపాన్లు రైతులను నిలువునా ముంచుతున్నాయి. ఆరుగాలం పడిన కష్టం.. ఒక్క వర్షంతో నేలపాలవుతోంది. వరుస ప్రకృతి వైపరీత్యాలు అన్నదాతకు పరీక్ష పెడుతుంటే.. ఆదుకోవడంలో ప్రభుత్వం నిబంధనల బూచి చూపుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు దఫాలుగా సంభవించిన తుఫాన్లు, కురిసిన అకాల వర్షాల వల్ల జిల్లాలోని వరి, పత్తి, మొక్కజొన్న, అరటి, కూరగాయల పంటలు సాగు చేసే రైతులకు అపార నష్టం వాటిల్లింది. నష్టం కొండంతైతే.. అందిన సాయం గోరంత దక్కితే గొప్పగా చెప్పుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. మూడు రోజులుగా మోంథా తుఫాన్ ఖరీఫ్ రైతు పొట్ట మీద కొట్టింది. మరో 10–15 రోజుల్లో కోతకు వస్తున్న దశలో వరి చేలు నీటమునిగాయి. 48 గంటలకుపైగా నీటిలోనే ఉండిపోవడంతో మొలకలు వస్తున్నాయి. మొక్కజొన్న రైతులదీ ఇదే పరిస్థితి. దీనివల్ల పంట దిగుబడి తగ్గడంతోపాటు.. మద్దతు ధర కూడా దక్కడం గగనమయ్యే పరిస్థితులు నెలకున్నాయి. మొక్కజొన్న గింజలు అమ్ముదామన్నా కొనుగోలు కేంద్రాలు లేకపోవడం రైతులను ఆందో ళనకు గురిచేస్తోంది.
ప్రకృతిపైనే ఆశలు..
జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి 1.76 లక్షల ఎకరాల్లో వరి సాగులో ఉంది. పత్తి 14 వేల ఎకరా లు, 15 వేల ఎకరాల్లో మొక్కజొన్న, అరటి ఐదు వే ల ఎకరాల విస్తీర్ణంలో సాగులో ఉన్నాయి. కూరగాయలు, ఇతర పంటలు మరో 70 వేల ఎకరాల మేర సాగు అవుతున్నాయి. 2 లక్షల మందికిపైగా రైతు లు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వరి ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు మదుపు పెడుతున్నారు. కొన్ని రకాల కూరగాయల కూ అదే మేర ఖర్చవుతోంది. అంతా సవ్యంగా సా గి, పంట ఆశించిన స్థాయిలో చేతికి అందొస్తే, చేతి లో నాలుగు డబ్బులు రైతుకు కనిపిస్తాయి. జిల్లాలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. విత్తు నుంచి విక్రయం వరకు రైతు పరిస్థితి దైవాధీనంగా మారింది. అన్ని గండాలనూ దాటుకుని ధాన్యం అమ్ముకుందామన్నా.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఆదుకోవు. దళారులు ‘మద్దతు’ దక్కనీయరు. ప్రస్తుతం సంభవించిన మోంథా తుఫాన్ వల్ల సుమారు 2 వేల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, ఉద్యాన పంటలకు నష్టం ఏర్పడినట్లు అంచనా. ప్రాథమిక స్థాయిలో పరిశీలించిన తర్వాత ఈ నష్టం మరింత పెరగవచ్చు.
పరిహారం.. పరిహాసం
ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతుల కు పరిహారం కూడా అందడం లేదు. 33 శాతానికి పైగా పంట నష్టం జరిగితేనే పరిహారం అందిస్తామ ని కూటమి ప్రభుత్వం చెబుతోంది. దీనివల్ల రైతుల కు ఆ మొత్తం అందడం లేదు. గత వైఎస్సార్సీపీ హయాంలో ఉచిత పంటల బీమా పథం అమలులో ఉండేది. రైతులందరి తరఫున అప్పటి ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించేది. దీనివల్ల విపత్తుల సమయంలో రైతుకు ధీమా లభించేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో ఆ పరిస్థితి లేకపోవ డంతో అన్నదాతలకు పంటల స్థానంలో కన్నీళ్లే మిగులుతున్నాయి.
 
							వెన్ను వంచుతున్న వాన
 
							వెన్ను వంచుతున్న వాన

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
