 
															అర్ధరాత్రి పోలీసుల తనిఖీలు
● పట్టుబడ్డ పాత నేరస్తుడు
విజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ ఎస్సై అశోక్ బుధవారం రాత్రి సిబ్బందితో కలిసి నాకాబందీ నిర్వహించారు. ఉగ్రవాది సిరాజ్ అరెస్టు పుణ్యమా అని నగరంలోని అలాంటి జాడలు ఉన్నాయేమోనన్న ఉన్నతాధికారుల ఆదేశాలతో రోజుకో స్టేషన్ ఎస్సై తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఎస్సై అశోక్, సిబ్బంది రామకృష్ణ, సూర్యారావులతో నగరంలోని వై జంక్షన్, చెల్లూరు, రింగ్ రోడ్డు, ధర్మపురి, గాజులరేగలలో అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించారు. ఫింగర్ ప్రింట్ డివైజ్తో దాదాపు ఆ సమయంలో ఎలాంటి కారణాలు లేకుండా తిరుగుతున్న 30 మంది నుంచి వివరాలు సేకరించారు.ఈ తనిఖీల్లోనే నగరంలోని టుటౌన్ పోలీస్ స్టేషన్పరిధి రాజీవ్నగర్కు చెందిన రఘు అనే పాతనేరస్తుడు దొరికాడు. ఒక వ్యభిచార కేసులో నిందితుడిగా ఉండి కేసు నమోదై కోర్టు వరకు వెళ్లివచ్చాడు. పోలీస్ రికార్డుల్లో నిందితుడిగా ఉండడం, మరోసారి మద్యం కేసులో పోలీసులకు అర్ధరాత్రి పట్టుబడ్డాడు.
11 గొర్రెల చోరీ
తెర్లాం: మండలంలోని విజయరాంపురం గ్రామంలో బుధవారం రాత్రి గొర్రెల శాలలోని 11 గొర్రెలను గుర్తు తెలియని వ్యక్తులు పట్టుకెళ్లిపోయారని గ్రామ సర్పంచ్ బూరి మధుసూదనరావు, గొర్రెల యజమాని వంజరాపు సత్యం గురువారం తెలిపారు. మేతకు తోలుకుని వెళ్లిన గొర్రెలను బుధవారం సాయంత్రం తిరిగి ఇంటికి తీసుకువచ్చి శాలలో పెట్టానని, గురువారం ఉదయం వెళ్లి చూడగా 11 గొర్రెలు కనిపించలేదని బాధితుడు తెలిపాడు. 11 గొర్రెల విలువ సుమారు రూ.80వేలు ఉంటుందని వాపోయాడు. గొర్రెల కోసం చుట్టు పక్కల పొలాల్లో వెదికినా ఆచూకీ కనిపించలేదని, దీంతో 11 గొర్రెలను దొంగలెత్తుకు పోయినట్లు వారు అనుమానం వ్యక్తంచేశారు.
చోరీ కేసులో పురోగతి
విజయనగరం క్రైమ్: వారం రోజుల క్రితం నగరంలో జరిగిన చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. ఉడా కాలనీ పరిధి కలాం విగ్రహానికి సమీపంలో కొద్దిరోజుల క్రితం ఎలక్ట్రికల్ వైర్లు చోరీ జరిగిందన్న అంశంపై వన్టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాలనీలోని కలాం విగ్రహం సమీపంలో 5 అంతస్తుల భవనం నిర్మాణం జరుగుతున్న సందర్భంలో ఇంటికి సంబంధించి సుమారు రూ.5లక్షల విలువ చేసే ఎలక్ట్రికల్ పనులను యజమాని రామునాయుడు చేయించారు. అయితే వాచ్మన్ ఉండగానే విద్యుత్ వైర్లను కోసి మరీ దొంగతనం జరగడంతో హుటాహుటిన వన్ టౌన్ పోలీసులకు యజమాని రామునాయుడు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేయగా క్రైమ్ పార్టీ సిబ్బంది మూడు రోజుల పాటు ఉడా కాలనీ, ద్వారపూడి, చెల్లూరు, ఆర్అండ్బీ గెస్ట్హౌస్, కేఎల్ పురం, పాల్నగర్, దుప్పాడ, అయ్యన్నపేటలలో వెతుకులాట చేశారు. కాగా ఒక వ్యక్తి టూ వీలర్పై ఆ ఎలక్ట్రికల్ వైర్లను పట్టుకెళ్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఆ ఫుటేజ్ ఆధారంగా క్రైమ్ ఎస్సై సురేంద్రనాయుడు తన సిబ్బంది రమణ, శ్రీనివాస్లతో దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలోనే చెల్లూరు సమీపంలో చెంచుల కాలనీకి చెందిన ఒక వ్యక్తిపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
నవంబర్ 2న రామనారాయణంలో కార్తీక దీపోత్సవం
విజయనగరం రూరల్: జిల్లా కేంద్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం రామనారాయణంలో నవంబర్ 2వ తేదీన కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు ఎన్సీఎస్ ట్రస్ట్ సభ్యులు నారాయణం శ్రీనివాస్, నీరజవల్లి దంపతులు తెలిపారు. ఇదే విషయమై వారు ఆలయ ప్రాంగణంలో గురువారం కార్తీక దీపోత్సవ ఆహ్వాన కరపత్రాలను ఆవిష్కరించారు. రాముని ధనుస్సు ఆకృతిలో చేసే దీపారాధనకు భక్తులంతా వచ్చి, కార్యక్రమంను విజయవంతం చేయాలని కోరారు. దీపోత్సవానికి వచ్చే భక్తులకు జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపం, ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న ఎన్సీఎస్ మల్టీప్లెక్స్, థియేటర్ల వద్ద పాసులు అందుబాటులో ఉంటాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
 
							అర్ధరాత్రి పోలీసుల తనిఖీలు
 
							అర్ధరాత్రి పోలీసుల తనిఖీలు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
