
అన్ని వర్గాలకూ చంద్రబాబు వెన్నుపోటు
సాక్షి, పార్వతీపురం మన్యం/సాలూరు :
అన్ని వర్గాల ప్రజలకూ కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు పీడిక రాజన్నదొర అన్నారు. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్లు అమలుకాని హామీలిచ్చి, అరచేతిలో వైకుంఠం చూపారని.. నమ్మి ఓటేసిన పాపానికి ప్రజలను నిలువునా మోసగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో దగా పడిన అన్ని వర్గాల వారికీ అండగా నిలవాలన్న ఉద్దేశంతోనే వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 4న జిల్లాలో వెన్నుపోటు దినం నిరసన ర్యాలీలు చేపడుతున్నట్లు చెప్పారు. సోమవారం సాలూరులో విలేకరులతో ఆయన మాట్లాడారు. తొలుత కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు.
అసెంబ్లీ సాక్షిగా మంత్రి అబద్ధాలు..
గత ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పథకాలంటూ ప్రచారం చేసుకున్నారని.. మేనిఫెస్టోలో పేర్కొన్న పథకాలన్నీ ఏమయ్యాయని రాజన్నదొర ప్రశ్నించారు. ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమన్నారు. రండి.. రండి.. నచ్చిన దగ్గరకు వెళ్లండి అని స్వయంగా చంద్రబాబు చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం జిల్లాకే పరిమితమని మంత్రి సంధ్యారాణి శాసనసభలో ప్రకటించారు. మేనిఫెస్టోలో చెప్పిన దానికి భిన్నంగా మంత్రి మాటలున్నాయి. మహిళలు ఏ మాటలు నమ్మాలి. గత ఆగస్టుకు అమలన్నారు. మళ్లీ ఇప్పుడు ఆగస్టు అంటున్నారు. ఇలా ఎన్ని ఆగస్టులు పోవాల’ని విమర్శించారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనమన్నారు. ఏడాది గడిచినా ఒక్కరికీ ఇవ్వలేదు. ఆడబిడ్డ నిధి కింద రూ.18 వేలు ఇస్తామని చెప్పారు. ఎప్పుడిస్తారో తెలియదు. ఇలా మహిళలకు ఇస్తామన్న ఏ పథకమూ అమలు చేయకుండా మన అక్కాచెల్లెమ్మలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు. గత ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి మహిళలకు రూ.18,750 చొప్పున ఇచ్చేవారు. ప్రతి అక్కా ఆలోచించాలి. మీ కోసమే మా నిరసన. ర్యాలీకి తరలివచ్చి మీ గళం వినిపించాలి.’ అని రాజన్నదొర పిలుపునిచ్చారు.
ఏడాదిలో యువతకు రూ.36 వేలు బాకీ..
నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామన్న చంద్రబాబు ప్రభుత్వం.. వారికి వెన్నుపోటు పొడిచిందని రాజన్నదొర విమర్శించారు. ఉద్యోగాలు ఇవ్వలేని పక్షంలో నెలకు నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామన్నారని.. ఏడాదవుతున్నా ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? అని నిరుద్యోగులను ఉద్దేశించి ప్రశ్నించారు. ఏడాది కాలంలో ఒక్కొక్కరికీ రూ.36 వేలు చొప్పున కూటమి ప్రభుత్వం బకాయి పడిందన్నారు. ‘యువతా.. ఆలోచించండి.. ఈ పోరాటం వైఎస్సార్సీపీ కోసం కాదు.. మీ కోసం.. మీ గళం వినిపించడానికి.. ఇందులో మీరంతా భాగస్వామ్యం కావాల’ని పిలుపునిచ్చారు.
వీరందరికీ చేసింది వెన్నుపోటు కాదా?
ఎస్సీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లు దాటితే పింఛన్ ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసగించారని రాజన్నదొర అన్నారు. కనీసం ఆ ఆలోచన కూడా ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం చేయలేదని గుర్తు చేశారు. కొండ మీద ఉన్న గిరిజనులకు కూడా ఎండీయూ వాహనాల ద్వారా తమ ప్రభుత్వంలో రేషన్ సరుకులు అందజేసేవారమని తెలిపారు. ఇప్పుడు ఎండీయూ వ్యవస్థను ఈ ప్రభుత్వం ఎత్తివేసిందన్నారు. వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ ఇస్తామని చేసిన ప్రకటన.. ఎక్కడా అమలు కాలేదన్నారు. వారంతా సుదూరం నడుచుకుంటూ వెళ్లి రేషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎండీయూ వాహనాల పట్ల కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించిందన్నారు. ఎంతో మంది నిరుద్యోగుల ఉపాధితీసేసిందని తెలిపారు. ‘వలంటీర్ల లేకుండా పింఛన్ ఇచ్చేస్తున్నామని చెబుతున్నారు. ఈ ప్రభుత్వానికి సిగ్గుందా? వలంటీర్లు ఒక్క సేవకే పరిమితం కాలేదు.. ఇల్లు, రేషన్, ఆధార్, పెన్షన్ ఏది కావాలన్నా.. నీరు లేకపోయినా, శానిటేషన్ బాగోకపోయినా వలంటీర్లకు ప్రజలు చెప్పేవారు. దేశానికే ఈ వ్యవస్థ ఆదర్శంగా నిలిచింది. అటువంటి వలంటీర్లకు వెన్నుపోటు పొడిచారు. మీరు అధికారంలోకి వస్తే వారికి రూ.10 వేలు ఇస్తామని చెప్పడం అబద్ధమా?’ అని కూటమి నాయకులను ప్రశ్నించారు. గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలుగా పరిగణిస్తామని, జీఓ 3 అమలు చేస్తామని మాటిచ్చి, ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. ఇలా గిరిజనులకూ కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందన్నారు. జగన్ రైతు భరోసా ఇస్తే.. చంద్రబాబు అన్నదాత సుఖీభవ అని మోసగించారని గుర్తు చేశారు. తాము రూ.13,500 రైతుభరోసా కింద ఇస్తే.. కేంద్రం ఇచ్చిన డబ్బులతో కలిపి ఇస్తారా? అని చంద్రబాబు గగ్గోలు పెట్టారని... ఇప్పుడు కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం రూ.20 వేలు ఇవ్వగలదా? అని ప్రశ్నించారు. ఏడాది కాలంలో రైతులకు రూపాయి కూడా ఇవ్వకుండా ఆ వర్గాన్నీ వెన్నుపోటు పొడిచారని తెలిపారు.
హామీలిచ్చి మోసగించారు..
మాట్లాడితే కేసు.. అరెస్టుల ఆంధ్రాగా మార్చారు
ప్రజలకు మంచి జరగాలనే మా పోరాటం
ఈ నెల 4న ‘వెన్నుపోటు దినం’ను విజయవంతం చేయాలి
మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు రాజన్నదొర
దగా పడ్డ ప్రజల కోసమే ‘వెన్నుపోటు దినం’
ఇలా అన్ని వర్గాల కోసమే ఈ నిరసన.. వైఎస్సార్సీపీ కోసం కాదని రాజన్నదొర అన్నారు. సాలూరులో ఈ నెల 4న చేపట్టబోయే ర్యాలీలో అన్ని వర్గాలూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకే ఈ పోరాటమని స్పష్టం చేశారు.
అరెస్టుల ఆంధ్రాలో.. మాట్లాడితే కేసు!
‘రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోంది. ఎవరడిగితే వారిపై కేసు.. ఎవరు మాట్లాడితే వారిపై కేసు. అరెస్టుల ఆంధ్రాగా మార్చేశారు. ఐఏఎస్, ఐపీఎస్లపైనా కేసులు పెడుతున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలా లేదు. ఎక్కడైనా ఐఏఎస్, ఐపీఎస్లపై ఇటువంటి అరెస్టులు ఉన్నాయా? అధికారులు ఆలోచించాలి. మాకు రెడ్బుక్ లేదు.. కానీ.. మేమూ రాసుకుంటున్నాం. ఏ అధికారి ఎలా వ్యవహరిస్తున్నారో గమనిస్తున్నామ’ని రాజన్నదొర వ్యాఖ్యానించారు. తాను ఏనాడూ పోలీసులపైన, ఇతర అధికారులపైన దురుసుగా వ్యవహరించలేదని, ఏ విషయంలోనూ వారిపై ఒత్తిడి తీసుకురాలేదని గుర్తు చేశారు. ‘ఆ రోజు మిమ్మల్ని ఎలా చూసుకున్నామో.. ఈ రోజు మీరు ఎలా పని చేస్తున్నారో ఒకసారి అధికారులంతా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇప్పుడున్న గిరిజన శాఖ మంత్రి మీ పట్ల ఎలా వ్యవహరిస్తున్నారు? ఒక్క సాలూరు నియోజకవర్గంలోనే ఎన్నో ఉద్యోగాలు తీసేశారు. సస్పెండ్ చేస్తున్నారు.. బలవంతంగా బదిలీలు చేస్తున్నారు. చివరికి వీఆర్వో, వీఆర్ఏలను కూడా వదలడం లేదు. పాచిపెంట మండలం కేసలి పంచాయతీలోనే పలువురిని విధుల నుంచి తొలగించారు. గతంలో మా ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి తేడా గమనించండి. జగన్ ప్రభుత్వంలో ఉద్యోగులకు మేలే జరిగింది గానీ, కీడు తలపెట్టలేదు. పీఆర్సీ కోసం ప్రత్యేక కమిషన్ను జగన్ వేశారు. ఈ ప్రభుత్వం వచ్చి ఏం చేసింది.. ఐఆర్ లేదు. డీఏలు పెండింగ్లో ఉన్నాయి. పాత పెన్షన్ విధానం కోసం ఏమైనా మాట్లాడుతున్నారా? బకాయి పడిన డబ్బులిచ్చారా?.. ఇది వెన్నుపోటు కాదా? ’ అని రాజన్నదొర ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలోనే హత్యలు, అత్యాచారాలు, అక్రమకేసులు అధికమయ్యాయని విమర్శించారు.